సంస్కృతీ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా గిరిజన మహిళలు, పురుషుల వస్త్రధారణ.. దమ్మక్క చిత్రపటాన్ని చేబూని మదినిండా తలుస్తూ సేవా యాత్ర.. వందలాది మంది గిరిజనుల సంప్రదాయ నృత్యాలు, కొమ్ము వాద్యాల నడుమ విన్యాసాలు.. అర్చకుల వేద మంత్రోచ్ఛరణల నడుమ భద్రాద్రి వీధులు, ఆలయ పరిసరాల్లో గిరి ప్రదక్షిణ.. దమ్మక్క విగ్రహం వద్ద పూజలు, భక్తిప్రపత్తులతో రామయ్యకు సేకరించిన పూలు, పండ్లు సమర్పణ తదితర ఘట్టాలతో భద్రగిరి మురిసిపోయింది. భక్తులు మైమరిసిపోయారు. భద్రాచలంలోని శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయ సన్నిధిలో సోమవారం అధికారులు, అర్చకులు దమ్మక్క సేవా యాత్ర ఘనంగా నిర్వహించారు.
భద్రాచలం, జూలై 3: ఏటా ఆషాఢ పౌర్ణమి రోజు భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో అధికారులు, అర్చకులు భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో దమ్మక్క సేవా యాత్ర నిర్వహిస్తారు. దీనిలో భాగంగా సోమవారం దేవస్థాన ఈవో ఎల్.రమాదేవి దమ్మక్క చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజనుల సంప్రదాయ నృత్యాలు, డప్పు వాద్యాల నడుమ, అర్చకుల వేద మంత్రోచ్ఛారణ మధ్య అధికారులు గిరి ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని దమ్మక్క విగ్రహానికి పూల మాల వేసి పూజలు నిర్వహించారు. యాత్రలో పాల్గొనేందుకు వందలాది మంది గిరిజన భక్తులు తరలివచ్చారు. అడవిలో లభించిన ఫల పుష్పాదులను రామయ్యకు సమర్పించారు. ఆలయ ఈవో రమాదేవి మహిళా భక్తులకు చీరె, పసుపు, కుంకుమ, ముత్యాల తలంబ్రాలు, లడ్డూ ప్రసాదం అందించారు. కార్యక్రమాల్లో దేవస్థానం ఏఈఓలు శ్రావణ్కుమార్, భవానీ రామకృష్ణ, ఆలయ సూపరింటెండెంట్లు కత్తి శ్రీనివాస్, లింగాల సాయిబాబా, సీసీ టూ ఈవో అనిల్కుమార్, ఆదివాసీ, కొండరెడ్ల సంఘాల నాయకులు పాల్గొన్నారు.