మామిళ్లగూడెం, మార్చి 21: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్ అన్నారు. ప్రింటింగ్ ప్రెస్, పెట్రోల్ బంక్, గోల్డ్ షాపుల నిర్వాహకులతో ఆయన గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీల ప్రచార సామగ్రి ముద్రణ విషయంలో ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులు లోబడి ఉండాలన్నారు. అనుమతి తీసుకున్న తర్వాతనే ఎన్నికల ప్రచార సామగ్రి ముద్రించాలన్నారు. అనుమతి కోసం నిర్ణీత నమూనా పత్రంలో వివరాలు సమర్పించాలని చెప్పారు. సామగ్రిని ముద్రణకు తీసుకొచ్చిన వారిలో ఇద్దరి నుంచి.. ‘మాకు ఈ పబ్లిషర్ తెలుసు’ అన్నట్లుగా డిక్లరేషన్ కాపీలు రెండింటిని తీసుకోవాలని తెలిపారు. ముద్రించిన ప్రచార సామగ్రిపై ప్రింటింగ్ ప్రెస్ పేరు, చిరునామా, సెల్నంబర్, ప్రచురణ ప్రతుల సంఖ్య, ప్రచురించే అభ్యర్థి పేరు, చిరునామా తదితర వివరాలు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ముద్రిత సామగ్రి ప్రతిపై ప్రింటర్ మెటీరియల్ డిక్లరేషన్తో పాటు సూచించిన ప్రొఫార్మాలో ముద్రించిన డాక్యుమెంట్ కాపీల సంఖ్య, ప్రింటింగ్ ధర తదితర వివరాలను సమర్పించాలని తెలిపారు. ఈ అంశాలను విస్మరించిన ప్రింటర్లపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పెట్రోల్ బంకులు, గోల్డ్ షాపుల నిర్వాహకులు తమ రోజువారీ లావాదేవీల వివరాలను తెలపాలన్నారు. సమావేశంలో జిల్లా సహకార శాఖ అధికారి మురళీధర్ రావు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.