ఏటా ముస్లింలు అత్యంత పవిత్రంగా.. నియమ నిష్టలతో జరుపుకునే పండుగ బక్రీద్(ఈదుల్ అజ్హా). త్యాగానికి ప్రతీకగా నిలిచే పండుగ రోజు ముస్లింలు మసీదు, ఈద్గాలకు వెళ్లి భక్తిశ్రద్ధలతో నమాజు చేయడం.. తదనంతరం దానధర్మాలు చేయడం ఆనవాయితీ. ఉన్న దాంట్లోనే తాహతుకు తగ్గట్లు దానం చేశామనే తృప్తి. ముస్లిం సోదరులు గురువారం జరుపుకునే బక్రీద్ పండుగ కోసం ఇప్పటికే మసీదులు, ఈద్గాలను ముస్తాబు చేశారు.
ఖమ్మం, జూన్ 28 : త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను నిర్వహించుకునేందుకు ముస్లిం సోదరులు సిద్ధమయ్యారు. జిల్లావ్యాప్తంగా ముస్లింలు నమాజు చేసేందుకు మసీదులు, ఈద్గాలను ముస్తాబు చేశారు. గురువారం ఉదయం 6.45 నుంచి 8.30 గంటల వరకు ‘ఈదుల్ అజ్హా’ బక్రీద్ ప్రత్యేక నమాజును వేలాది మంది ముస్లింలు ఆచరించనున్నారు. జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి, మధిర, వైరా, పాలేరు నియోజకవర్గ కేంద్రాల్లోని మసీదులు, ఈద్గాలను ప్రార్థనల కోసం సిద్ధం చేశారు. భక్తిశ్రద్ధలతో నమాజు చేసిన అనంతరం తమ తాహతకు తగ్గట్టుగా గొర్రెలను కోసి ఖుర్బానీ చేసి వాటి మాంసాన్ని మూడు భాగాలుగా చేసి పంచిపెడతారు.
ఈదుల్ అజ్హా(బక్రీద్) ప్రాముఖ్యత
బక్రీద్ పండుగను ‘ఈదుల్ అజ్హా’గా పేర్కొంటారు. ఖుర్బానీ అంటే సమర్పణ, త్యాగం, బలి అనే అర్థాలు. సుమారు 4వేల ఏళ్ల క్రితం ఇరాక్ దేశంలో పండిత కుటుంబంలో జన్మించిన దైవ ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాంకు ఒకరోజు కల వచ్చింది. 86 ఏళ్ల వృద్ధాప్యంలో జన్మించిన తన ఏకైక కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాంను ఖుర్బానీ చేయాలని అల్లాహ్ కలలో ఇబ్రహీంను ఆదేశించినట్లు సారాంశం. దీంతో తన కుమారుడిని బలివ్వడం కోసం ప్రయత్నించడం, అల్లాహ్ దానిని స్వీకరించి ఇస్మాయిల్ అలైహిస్సలాంకు బదులు స్వర్గం నుంచి ఓ పొట్టేలు(దుంబా)ను పంపించి ఖుర్బానీ చేయడమే ఈ పండుగ ప్రత్యేకత. మానవ ఇతిహాసంలో కనీవినీ ఎరుగని రీతిలో అనేక సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి.
అందులో భాగంగానే మహాప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం జీవితంలో జరిగినట్లు ప్రతీతి. తాతముత్తాతల కాలం నుంచి వస్తున్న దురాచారాలను, దుస్సంప్రదాయాలను, మూఢనమ్మకాలను ఇబ్రహీం ఎదిరించారు. అన్యాయాన్ని, అక్రమాలను ప్రశ్నించారు. అవినీతి, అధర్మానికి ఎదురు తిరిగారు. బహుదైవారాధన, విగ్రహారాధన మహాపాపమని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలు, పీడిత తాడిత శ్రామిక వర్గాల గుండె గొంతుకగా మారారు. అసభ్యం, అశ్లీలత, మద్యపానం, బ్రూణహత్యలు, అంటరానితనం వంటివి సామాజిక నేరాలని ఉపదేశిం చాడు.
ఆయన తండ్రితోపాటు గ్రామస్తులంతా దీనిని సహిం చలేకపోయారు. ఈ క్రమంలోనే ఇబ్రహీంను దేశ బహిష్కరణ చేశారు. ఒక సందర్భంలో ఇబ్రహీంను అగ్నిగుండంలో వేసి తగులబెట్టారు. అయితే ఆ అగ్నిగండంను అల్లాహ్ తన ఇబ్రహీం కోసం గులాబీ వనంచేసి మంటల వేడికి బదులు చల్లటి ప్రశాంతతను కల్పించి కాపాడారు. ఇలాంటి పరీక్షల్లో మరొకటి ఇబ్రహీంకు తన ప్రభువైన అల్లాహ్ కూడా మరో పరీక్ష పెట్టాడు. తన భార్యతోపాటు తన ఏకైక సంతానాన్ని జనసంచారం లేని సుదూర ఎడారి ప్రాంతంలో వదిలేయాల్సిందిగా ఆదేశించాడు. అల్లాహ్ ఆదేశం మేరకు ఇబ్రహీం తన భార్య, కుమారుడిని వదిలివేసి వెనక్కు వచ్చాడు.
కాగా.. ఎలాంటి జన సంచారం, ఆకలి దప్పులు తీర్చుకునేందుకు కూడా అవకాశం లేని ఆ ప్రాంతంలో అల్లాహ్ తన అద్భుత శక్తితో ఒక నీటి చెలిమను ప్రత్యక్షపరిచాడు. నేడు యావత్ ప్రపంచ ముస్లింలు(హజ్కు వెళ్లేవారు) ఈ నీటిని ‘జమ్ జమ్’ అని పవిత్ర జలంగా స్వీకరిస్తారు. ఇబ్రహీం అలైహిస్సలాం, ఆయన కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం త్యాగస్మరణే నేడు ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఈదుల్ అజ్హా(బక్రీద్)ను జరుపుకుంటుంటారు. ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం ‘జిల్ హజ్’ మాసం 10వ తేదీన పండుగను జరుపుకుంటారు. అదేరోజు పవిత్ర మక్కా నగరంలో ‘హజ్’ కూడా జరుగుతుంది.
ఖుర్బానీ ప్రాముఖ్యత
ఇబ్రహీం అలైహిస్సలాం త్యాగానికి ప్రతిఫలంగా ప్రాప్తించిన ఈ పండుగను ఏటా ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈదుల్ అజ్హా ప్రత్యేక నమాజు అనంతరం ముస్లింలు ఖుర్బానీ చేస్తారు. ఆర్థికంగా ఉన్నవారు ఒంటరిగానే గొర్రె, మేకపోతులను దానం చేస్తారు. మధ్యతరగతి వారు ఏడుగురు కలిసి ఆవును లేదా ఒంటెను ఖుర్బానీ చేసి దాని మాంసాన్ని మూడు భాగాలుగా చేసి ఒకటి పేదలకు, మరొకటి బంధువులకు, ఇంకో వాటా తమ ఇంటికి వినియోగించుకుంటారు. మహాప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం సూచించిన విధానాలను అవలంబించడం కోసం, ఆయన చూపిన మార్గంలో నడిచేందుకు ప్రాయశ్చిత్తంతో ప్రత్యేక నమాజు చేసి తమ తప్పులను మన్నించమని వేడుకుంటారు. ఆరోగ్యంతో పరిపుష్టిగా ఉన్నవారు ఉపవాసాలు సైతం ఆచరిస్తారు. పండుగ కోసం ఎక్కువగా గొర్రెలు, మేకపోతులు కొనుగోలు చేస్తుండడంతో జిల్లాలోని పశువుల సంతలతోపాటు గ్రామాల్లో వీటి ధరలు చుక్కలనంటాయి. సాధారణ ధరల కంటే రెట్టింపు ధరలతో వీటి అమ్మకాలు సాగుతున్నాయి.
ముస్తాబైన మసీదులు, ఈద్గాలు
గురువారం జరిగే ఈదుల్ అజ్హా పండుగ ప్రత్యేక నమాజు కోసం ఖమ్మంతోపాటు సత్తుపల్లి, మధిర, వైరా, పాలేరు నియోజకవర్గాల్గోని మసీదులు, ఈద్గాలు ముస్తాబయ్యాయి. పరిగడుపునే నమాజు చేయాల్సి ఉండడంతో ఉదయం 6.45 గంటల నుంచి, కొన్ని మసీదులలో ఉదయం 7.30 నుంచి 8.30 గంటల వరకు, మరికొన్ని మసీదులలో ఈదుల్ అజ్హా ప్రతి ముస్లింలు నమాజును ఆచరించాలని మత గురువులు విజ్ఞప్తి చేశారు.