ఖమ్మం, మార్చి 31: ఈస్టర్ వేడుకలు ఆదివారం సంబురంగా జరిగాయి. ఏసుప్రభు సమాధి నుంచి సజీవుడై పునరుద్ధానం చెందిన రోజును ఈస్టర్గా విశ్వాసులు ఆదివారం జరుపుకున్నారు. నగరంలోని చర్చి కాంపౌండ్ సీఎస్ఐ చర్చిలో ఆదివారం తెల్లవారుజాము నుంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రెవరెండ్ పాస్టర్ శివం తదితరులు పాల్గొన్నారు. వైరా రోడ్ లోని ఆర్సీఎం చర్చిలో శనివారం అర్ధరాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈస్టర్ దైవ సందేశాన్ని ఫాదర్ రెవరెండ్ సురేష్ కుమార్ అందించారు. ఫాదర్ బాలశౌరి, ఫాదర్ పీటర్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
కరుణగిరి ఆర్సీఎం చర్చిలో బిషప్ రెవరెండ్ ఉడముల బాల, కరుణగిరి డైరెక్టర్ ఫాదర్ మాథ్యూ వరప్రసాద్ రాజు ప్రత్యేక దైవ సందేశాన్ని భక్తులకు అందించారు. మౌంట్ ఫోర్ట్ ఆర్సీఎం చర్చిలో ఫాదర్ లాజర్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చ్ కాంపౌండ్ సీఎస్ఐ చర్చిలో గ్రూప్ చైర్మన్ రెవరెండ్ విశ్వం ఈస్టర్ శుభ సందేశాన్ని అందించారు. ఎన్ఎస్పీ కాలనీ హోలీ ట్రినిటీ చర్చ్, ఇందిరానగర్ కాలనీ సీఎస్ఐ చర్చ్, పార్సీబంధం సీఎస్ఐ చర్చ్, ఇండిపెండెంట్ చర్చిలలో ఈస్టర్ వేడుకలు జరిగాయి. రోటరీ నగర్లోని గుడ్ షెఫర్డ్ చర్చిలో రెవరెండ్ సత్యపాల్ ప్రత్యేక సందేశాన్ని అందించారు.