ఆరుగాలం శ్రమించి రైతు పంట పండిస్తాడు.. పండించిన దిగుబడికి తగిన ఫలం ఆశిస్తాడు.. కొండంత ఆశలతో పంటను మార్కెట్కు తీసుకొస్తాడు.. అక్కడ రైతుకు అన్నివిధాలా అండగా నిలిచి పంటను పారదర్శకంగా కొనుగోలు చేయించడం మార్కెటింగ్శాఖ ప్రధాన కర్తవ్యం.. దీనిలో భాగంగా పంట కొనుగోలు ప్రక్రియను పక్కాగా చేపట్టేందుకు వ్యయసాయ మార్కెట్లలో తెలంగాణ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఎక్సే ్చంజ్ (ఈ-టామ్) అనే విధానాన్ని అమలు చేస్తున్నది. రాష్ట్రంలోని అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో 2020 నుంచి ఈ ఆన్లైన్ విజయవంతంగా అమలవుతున్నది. ఈ పద్ధతిలో పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ జరుగుతుండడమే కాక సెస్ రూపంలో మార్కెట్కు గణనీయమైన ఆదాయం వస్తున్నది..
ఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 23: వ్యవసాయ మార్కెట్లలో పంట కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టేందుకు రాష్ట్ర మార్కెటింగ్శాఖ తెలంగాణ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఎక్సేంజ్ (ఈ-టామ్) అనే ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో 2020 నుంచి ఈ విధానం విజయవంతంగా అమలవుతున్నది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్కెటింగ్శాఖ ఈ విధానాన్ని రూపొందించింది. గతంలో అమలు చేసిన అనేక విధానాల నుంచి ఈ- టామ్ వరకు సరికొత్త సాంకేతికతకు మార్కెటింగ్శాఖ పెద్దపీట వేస్తున్నది. ఆరుగాలం కష్టించి రైతులు పండించిన పంటను పారదర్శకంగా కొనుగోలు చేస్తున్నది. గతేడాది కేవలం ఖమ్మం మార్కెట్లోనే ఈ-టామ్ విధానంలో వందశాతం మిర్చి క్రయవిక్రయాలు జరిగాయి. దీనిపై ఖమ్మం ఏఎంసీ మార్కెటింగ్శాఖ అధికారులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందాయి.
ఈ- టామ్ విధానం పంట మార్కెట్లోకి వచ్చిన దగ్గర్నుంచి తోలకాలు పూర్తయ్యేవరకూ కొనసాగుతుంది. రైతు పంటను యార్డులోకి తీసుకువచ్చే సమయంలోనే గేట్ వద్ద ఆపరేటర్లు డాటా నమోదు చేస్తారు. రైతు పేరు, అతని స్వస్థలం, మొబైల్ నంబర్, పంట రకంతో పాటు యార్డ్కు తీసుకువచ్చిన బస్తాల సంఖ్యను ఎంట్రీ చేస్తారు. అనంతరం ప్రతి రైతుకు ఒక ఐడీ నంబర్ ఇస్తారు. దాదాపు జెండా పాట జరిగే సమయానికి ఈ తతంగమంతా పూర్తవుతుంది. ఈలోపు మార్కెటింగ్శాఖ అధికారులకు మార్కెట్కు ఎంతమంది రైతులు, ఎన్ని రకాల పంటలను మార్కెట్కు తీసుకువచ్చారు, ఎంత మొత్తంలో తీసుకొచ్చారు.. మొత్తం ఎన్ని లాట్స్ అవుతాయనే అంశాలపై స్పష్టత వస్తుంది. వాటి ప్రకారం దడవాయిలు కాంటాల ప్రక్రియ ప్రారంభిస్తారు. రైతుల ఐడీ ఆధారంగానే కొనుగోళ్ల ప్రక్రియ సాంతం సాగుతుంది. ఐడీ లేకుండా రైతుల తీసుకువచ్చిన పంటను కొనుగోలుచేసేందుకు ఆస్కారమే లేదు. కాంటా ప్రక్రియ ముగిసిన మరుక్షణం రైతుకు రశీదు అందుతుంది. రశీదులో పంటకు అందిన ధర వివరాలు ఉంటాయి. అలాగే హమాలీల చార్జీలు, బస్తా ఖరీదు వివరాలు తెలుస్తాయి.
ఏటా మిర్చి సీజన్లో వ్యవసాయ మార్కెట్లలో పంట కొనుగోళ్ల విషయమై సాంకేతిక సమస్యలు తలెత్తేవి. ఇలా తరచూ క్రయవిక్రయాలు నిలిచిపోయేవి. మార్కెటింగ్శాఖ క్షేత్ర స్థాయిలో ఏం జరిగిందో తెలుసుకునేందకు చాలా సమయం పట్టేది. ఈ-టామ్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత అలాంటి సమస్యలన్నింటికీ చెక్పడింది. ఇప్పుడు అధికారులు తాము ఉన్నచోట కంప్యూటర్లు, మొబైల్స్ నుంచే క్రయవిక్రయాలను పరిశీలించే సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఏవైనా సమస్యలు తలెత్తితే నిమిషాల్లో వాటిని సవరించే అవకాశం ఉంది. అంతేకాదు.. ఈ సాంకేతికత ద్వారా క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల వరకూ ఎవరు.. ఎక్కడి నుంచైనా పంట కొనుగోళ్ల ప్రక్రియను పర్యవేక్షించే అవకాశం ఉన్నది. ఖమ్మం ఏఎంసీ పరిధిలో ప్రస్తుతం ఈ-టామ్ విధానం విజయవంతంగా అమలవుతున్నది.
ఈ-టామ్ విధానం అమలులోకి రాకముందు పంట ధర నిర్ణయించిన తర్వాత ఖరీదుదారుల కాంటాల వద్ద పేచీలు పెట్టేవారు. ఏదో ఒక వంక పెట్టి పంటను తక్కువ విలువకు కొనుగోలు చేసేవారు. ఈ-టామ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అలాంటి అవకతవకలకు చెక్ పడింది. ఒకసారి కాంటా ప్రక్రియ ముగిసిన తర్వాత రైతుకు రశీదు అందితే.. ఇక అదే ఫైనల్. గతేడాది నుంచి ఈ విధానం అమలవుతున్నది. ఇప్పుడు అరకొర తప్పితే పేచీలకు తావే లేదు. ఈ-టామ్ విధానంతో పారదర్శకంగా పంట కొనుగోళ్ల ప్రకియ కొనసాగుతున్నది. మరోవైపు కమిషన్ వ్యాపారులు, ఖరీదుదార్యుల సౌకర్యార్థం రాష్ట్ర మార్కెటింగ్శాఖ ప్రత్యేకంగా మొబైల్ యాప్ను అందుబాటులోకి తెస్తున్నదని సమాచారం. యాప్ ద్వారా ఏ కమిషన్దారుడు ఏయే పంటలు కొనుగోలు చేశారు.. ఏ పంట ఎంత మొత్తంలో కొనుగోలు చేశాడు.. అనే అంశాలే కాక ఆర్థిక లావాదేవీలనూ యాప్లో చూసుకునే అవకాశం ఉంటుందని తెలుస్తున్నది.