ఖమ్మం : జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాతం వాతావరణంలో పకడ్బందీగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వీ.పీ.గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వాహణ ఏర్పాట్ల పై సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అనుబంధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఈ నెల 25వ తేదీ నుంచి నవంబర్ 3వ తేది వరకు జరగనున్నాయని తెలిపారు. పరీక్షలకు 17738 మంది విద్యార్థులు హాజరు కానున్నారని ఈ పరీక్షల నిర్వాహణకు 76 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఖమ్మం నగరంతో పాటు అన్ని మండల కేంద్రాలలో పరీక్షా కేంద్రాలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని, వాటిలో విద్యార్థులకు అవసరమైన మౌళిక వసుతల కల్పన పూర్తి చేయాలని ఆదేశించారు.
మండల ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని అన్ని పరీక్షా కేంద్రాలను ఒక రోజు ముందుగానే సందర్శించి ఏర్పాట్లు పరిశీలించాలని ఆదేశించారు. పరీక్షల సమయంలో నిరంతరం విద్యుత్తు సరఫర ఉండాలని, అన్ని పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ బస్సుల సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు.