ఖమ్మం వ్యవసాయం, జనవరి 17: ఖమ్మం నగరంలో బుధవారం జరిగే భారత రాష్ట్ర సమితి సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వంద ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికతోపాటు దానికి కుడి వైపున రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే గులాబీ శ్రేణులకు పార్టీ దిశా నిర్దేశం చేసే ఉద్దేశంతో సాంస్కృతిక కార్యక్రమాల నిమిత్తం మరో వేదికను సిద్ధం చేశారు. దూంధాం పేరుతో విశాలమైన వేదిక సిద్ధమైంది. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, రాష్ట్ర సాంస్కృతిక సారథి సాయిచంద్ ఆధ్వర్యంలో దూంధాం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రముఖ కళాకారుడు, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సైతం పార్టీ శ్రేణులను తన ఆటాపాటలతో ఉర్రూతలూగించున్నారు.
జిల్లా సాంస్కృతిక సారథి కళాకారులతోపాటు రాష్ట్ర సాంసృతిక సారథికి చెందిన సుమారు వందమంది కళాకారులు తమ ఆటాపాటలను ప్రదర్శించనున్నారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకూ తెలంగాణ సర్కారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి, వాటి ద్వారా ప్రజలకు జరిగిన మేలు గురించి ఆటపాటల ద్వారా అవగాహన కల్పించనున్నారు. అదే విధంగా రాష్ట్ర సాధనలో సీఎం కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చేసిన పోరాటం తీరును ధూంధాంలో ప్రదర్శించనున్నారు. అదేవిధంగా భారత రాష్ట్ర సమితి ఏర్పాటు ఆవశ్యకత గురించి పాటల ద్వారా ప్రజలకు, పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించనున్నారు. వివిధ జిల్లాల నుంచి చాలామంది ప్రజలు ఉదయమే చేరుకునే అవకాశం ఉన్నందున ఉదయం 11 గంటల నుంచే ధూంధాం కార్యక్రమం ప్రారంభం కానుంది.
లక్షలాది మంది వీక్షించేందుకు గాను ధూంధాం వేదికను ఎత్తయిన ప్రదేశంలో ఏర్పాటుచేశారు. చివరి భాగాన ఉండే ప్రజల సౌకర్యార్థం పెద్దపెద్ద ఎల్ఈడీ స్క్రీన్లను సైతం ఏర్పాటు చేశారు. వీరితోపాటు ఆయా జిల్లాలు, మండలాలకు చెందిన కళాకారులు వేదిక వద్దకు బోనాలు, బతుకమ్మలను రానున్నారు. ఆహూతలను అలరించేందుకు స్థానిక కళాకారులు, కోలాట బృందాలు సైతం ప్రదర్శనగా రానున్నాయి.