కరకగూడెం, మే 27 : ఏజెన్సీ గ్రామాల అభివృద్ధే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని, మారుమూల గ్రామాలకు సైతం సీఎం కేసీఆర్ వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధి చేస్తున్నారని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శనివారం కరకగూడెం మండలంలోని అనంతారం వయా కొత్తూరు- గొల్లగూడెం గ్రామాల మధ్య వట్టివాగుపై రూ.1.30 కోట్లతో నిర్మించిన వంతెన, చొప్పాల- కొత్తూరు గ్రామాల మధ్య ముక్కిటివాగుపై రూ.2.58 కోట్లతో నిర్మించిన వంతెనతోపాటు మోతె- బర్లగూడెం గ్రామాల మధ్య పెద్దవాగుపై రూ.4.50 కోట్లతో నిర్మించిన వంతెనను ఎమ్మెల్యే రేగా ప్రారంభించారు.
కరకగూడెం నుంచి చిరుమళ్ల వరకు రూ.2.91 కోట్లతో నిర్మాణం చేపట్టనున్న బీటీ రోడ్డు, వట్టంవారిగుంపు నుంచి అరెంవారిగుంపు వరకు రూ.2 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ పినపాక నియోజకవర్గంలో ప్రజల అవసరాలు గుర్తించిన ప్రభుత్వం వాగులపై వంతెనలు, మారుమూల గ్రామాల్లో బీటీ రోడ్లను నిర్మించి ఏజెన్సీ రూపురేఖలనే పూర్తిగా మార్చిందని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇతర పార్టీల నాయకులు వచ్చి కల్లబొల్లి మాటలు చెబుతారని, వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తున్న బీఆర్ఎస్ను ఆదరించి మూడోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టాలని కోరారు. పులుసుబొంత ప్రాజెక్ట్ నిర్మాణానికి అన్ని అనుమతులు వచ్చాయని త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తిచేసి పనులు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళిక, తహసీల్దార్ ఉషాశారద, పీఆర్ ఏఈ రెయిన్హాడ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, నాయకులు అక్కిరెడ్డి వెంకటరెడ్డి, సంజీవరెడ్డి, కొంపెల్లి పెదరామలింగం, రాము, చిరంజీవి, సత్యనారాయణ, రంజిత్, రాంబాబు, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
పినపాక మండలంలో..
పినపాక, మే 27 : మండలంలోని ఐలాపురం నుంచి పోట్లపల్లి వరకు రూ.కోటి 42 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణానికి, పినపాక నుంచి గడ్డంపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు శంకుస్థాపన చేశారు. అనంతరం మారేడుగూడెం గ్రామానికి వెళ్లే రహదారిపై నిర్మించిన వంతెనను ప్రారంభించి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నదన్నారు. మారుమూల గ్రామాల్లో సైతం రహదారులు అద్దంలా తయారయ్యాయని పేర్కొన్నారు. ఈబయ్యారం అడ్డరోడ్లోని పీఏసీఎస్ కార్యాలయంలో రైతులకు సబ్సిడీపై జీలుగు విత్తనాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, జడ్పీటీసీ దాట్ల సుభద్ర, పీఏసీఎస్ చైర్మన్ వర్మ, ఆత్మ చైర్మన్ భద్రయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పగడాల సతీశ్రెడ్డి, నాయకులు భవానీశంకర్, గణేశ్, సురేశ్, తిరుపతి, వెంకటరెడ్డి, కొండేరు రాము, సంజీవరెడ్డి, సర్పంచులు నాగేశ్వరరావు, నర్సింహారావు, ఎంపీటీసీలు సత్యం, శేఖర్ పాల్గొన్నారు.