మామిళ్లగూడెం, మార్చి 3: ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో మొదటి విడత కింద చేపట్టిన 426 పాఠశాలల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి సూచించారు. ‘మన బడి’ పనుల పురోగతిపై ఖమ్మం ఐడీవోసీలో కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి విద్యాశాఖ అధికారులు, వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పనులు పూర్తయిన చోట ఈ నెల 10లోగా ప్రారంభోత్సవాలు చేపట్టాలని, ఈ మూడు నెలలు కష్టపడి పని చేయాలని, మే 31లోగా అన్ని పాఠశాలలు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, డీఈవో సోమశేఖరశర్మ, డీఆర్డీవో విద్యాచందన, ఈఈలు నాగశేషు, కేవీకే శ్రీనివాస్, చంద్రమౌలి, శ్యామ్ప్రసాద్, ఎంఐఎస్ రామకృష్ణ, ఎంఈవోలు తదితరులు పాల్గొన్నారు.