మామిళ్లగూడెం, జూన్ 2: తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్నామని, దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెడుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ‘సంక్షేమం – అభివృద్ధి – సామాజిక న్యాయం’ అనే మూడు ప్రధాన లక్ష్యాలతో తెలంగాణను ముందుకు తీసుకెళ్తున్నట్లు వివరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మంలోని పరేడ్ గ్రౌండ్లో మంగళవారం నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్ దివాకర టీఎస్తో కలిసి నివాళులర్పించారు.
అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి పౌరుడికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాష్ట్రంలో 1.15 కోట్ల మందికి జీవిత బీమా పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అల్పాహార పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.
ఇంటర్ చదువుతున్న 6,300 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతోపాటు అల్పాహారం అందిస్తామని తెలిపారు. జిల్లాలో 59,448 కొత్త రేషన్కార్డులు జారీ చేశామన్నారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద 2,45,069 మంది మహిళలకు రూ.500కే నూతన గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశామని తెలిపారు. గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ల లోపు వినియోగిస్తున్న 2,50,204 కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని అన్నారు.
రైతు భరోసా పథకంలో 3,43,997 మంది రైతులకు రూ.270 కోట్ల నిధులు జమ చేశామన్నారు. యాసంగి సిజన్లో రైతుల నుంచి 1,42,273 మెట్రిక్ టన్నుల ధాన్యం, 2,80,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు కొనుగోలు చేశామని వివరించారు. కలెక్టర్ దివాకర టీఎస్, సీపీ సునీల్దత్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డీఎఫ్వో అనూజ్ అగర్వాల్, సుడా చైర్మన్ దుర్గాప్రసాద్, అమరవీరుల కుంటుంబ సభ్యులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.