భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ మణుగూరు టౌన్, నవంబర్ 2 : మణుగూరులో ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యాలయం తమదంటూ కొన్ని రోజులుగా కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. పత్రాలు చూపించి నిరూపించుకోవాలంటూ బీఆర్ఎస్ నాయకులు సోషల్మీడియా ద్వారా సమాధానమిస్తున్నారు. ఈ క్రమంలో సమయం కోసం వేచి చూసిన కాంగ్రెస్ గూండాలు ఆదివారం పక్కా స్కెచ్తో రంగంలోకి దిగారు. బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే అయిన రేగా కాంతారావు, పార్టీ నాయకులు కొద్దికాలంగా జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికల ప్రచారంలో ఉంటున్నారు. దీనిని అదునుగా భావించిన కాంగ్రెస్ రౌడీమూకలు ఆదివారం ఉదయం పది గంటలకు మణుగూరులోని బీఆర్ఎస్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.

షట్టర్లు పగులగొట్టి లోనికి వెళ్లి విధ్వంసం సృష్టించారు. స్థానికంగా ఉండే నలుగురు బీఆర్ఎస్ కార్యకర్తలు హుటాహుటినా అక్కడికి చేరుకొని అడ్డుకోబోయారు. దీంతో ఆ బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ గూండాలు విచక్షణారహితంగా పిడిగుద్దులు గుద్దారు. తీవ్రంగా గాయపడిన వారిని బయటకు గెంటివేశారు. కాంగ్రెస్ గూండాగిరి ప్రదర్శించి బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆక్రమించడం, ఫర్నిచర్కు నిప్పుపెట్టడంతో పట్టణ ప్రజలు, స్థానికులు పెద్దసంఖ్చలో అక్కడికి చేరుకున్నారు. వందల సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి విధ్వంసం సృష్టిస్తుండడంతో మణుగూరు సబ్ డివిజన్ పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. 144వ సెక్షన్ విధించారు. మధ్యాహ్నం తరువాత పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

మణుగూరులోని బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ దాడిని ఖండిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ నాయకులు ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు చేసి కాంగ్రెస్ దౌర్జన్యాన్ని ఖండించారు. అయితే, బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ గూండాలను ఏమీఅనని పోలీసులు.. కాంగ్రెస్ రౌడీయిజాన్ని ప్రశ్నిస్తూ నిరసనకు దిగిన బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేశారు. కాగా, ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి కాంగ్రెస్ దాడిని ఖండించారు. ఇల్లెందు, అశ్వారావుపేట, వైరా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు, చంద్రావతి, బీఆర్ఎస్ ఖమ్మం నేత ఆర్జేసీ కృష్ణ కూడా వేర్వేరు ప్రకటనల్లో కాంగ్రెస్ దాడులను ఖండించారు.

మణుగూరులో కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోయారు. స్థానిక బీఆర్ఎస్ పినపాక నియోజకవర్గ కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. నలుగురు బీఆర్ఎస్ కార్యకర్తలపై పిడిగుద్దులు గుద్ది బయటకు ఈడ్చేశారు. కార్యాలయంలోని కుర్చీలు, బల్లాలు, ఇతర ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. వాటన్నింటినీ కార్యాలయం ఎదుట విసిరిపారేశారు. గులాబీ జెండాలు, ఫ్లెక్సీలను సైతం వాటిపైవేసి పెట్రోలు పోసి నిప్పు పెట్టారు. అగ్నికీలలు ఎగిసిపడుతుండడంతో ఇరుగూపొరుగూ నివాసాల వారు భయాందోళనకు గురయ్యారు. అంతటితో ఆగని కాంగ్రెస్ మూకలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫొటోను బయటకు తీసుకొచ్చి నేలకు విసిరికొట్టి విధ్వంసం సృష్టించారు.

బీఆర్ఎస్ కార్యాలయానికి ఉన్న గులాబీ రంగు పెయింట్పై కాంగ్రెస్ రంగు వేశారు. ‘తెలంగాణ భవన్’ పేరు కనిపించకుండా రంగు వేసి దానిపై ‘ఇందిరమ్మ కార్యాలయం’ అంటూ ఉన్న ఫ్లెక్సీని కట్టారు. కార్యాలయ పైఅంతస్తులో దిమ్మెకు ఉన్న బీఆర్ఎస్ జెండాను తొలగించి కాంగ్రెస్ జెండాను ఏర్పాటుచేశారు. ఈ క్రమంలో స్థానికుల సమాచారంతో ఫైరింజన్ ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పింది. తరువాత పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి ఉద్రిక్త పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.




