నేలకొండపల్లి, జనవరి 25: ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని భక్త రామదాసు ధ్యాన మందిరాన్ని రూ.కోటి ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తామని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. భక్తరామదాసు స్వస్థలమైన నేలకొండపల్లిలో బుధవారం ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి భక్త రామదాసు జయంత్యుత్సవాలను ప్రారంభించారు. తొలుత మండల కేంద్రంలోని భక్తరామదాసు కాంస్య విగ్రహానికి క్షీరాభిషస్త్రకం చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు.
ఇటీవల జరిగిన ఖమ్మం బీఆర్ఎస్ సభలో ముఖ్యమంతి కేసీఆర్ నేలకొండపల్లి మేజర్ పంచాయతీ అభివృద్ధికి రూ.కోట్లు ప్రకటించారని, వాటిలో రూ.కోటితో రామదాసు మందిరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. భవిష్యత్తు తరాలకు గుర్తుండేలా భక్తరామదాసు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం నేలకొండపల్లిలో ఆడిటోరియం పనులు చివరి దశకు వచ్చాయన్నారు. వచ్చే ఏడాది నుంచి ఆడిటోరియంలోనే ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. భక్తరామదాసు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య, సర్పంచ్ రాయపూడి నవీన్, ఎంపీటీసీలు బొడ్డు బొందయ్య, శీలం వెంకటలక్ష్మి, విద్వత్ కళాపీఠం అధ్యక్షుడు సాధు రాధాకృష్ణమూర్తి, అర్చకుడు సౌమిత్రి రమేశ్ పాల్గొన్నారు.