ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 3 : గోళ్లపాడు చానెల్ ఆధునీకరణ పనుల పురోగతి పట్ల కలెక్టర్ వీపీ గౌతమ్ సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం ఆయన త్రీటౌన్ ప్రాంతంలోని గోళ్లపాడు చానెల్ ఆధునీకరణ పనులను క్షేత్రస్థాయిలో పర్యటించారు. స్వయంగా కాలినడకన ఆయా డివిజన్లలో పర్యటించారు. మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి పనుల పురోగతిని పరిశీలించారు. ప్రకాశ్నగర్, సుందరయ్యనగర్, పంపింగ్వెల్రోడ్, మంచికంటినగర్, రంగనాయకుల గుట్ట ప్రదేశాల్లో కలియతిరిగారు. సుందరీకరణలో భాగంగా పట్టణ ప్రకృతివనాలు పురోగతిలో ఉన్నాయన్నారు.
పంపింగ్వెల్రోడ్, సుందరయ్యనగర్, రంగనాయకుల గుట్టవద్ద మొత్తం ఐదు ప్రకృతివనాలు అభివృద్ధి చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. పార్కులలో పిల్లల ఆట పరికరాలు, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సమీప ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పట్టణక్రీడా ప్రాంగణాల్లో యువతకు అవసరమైన క్రీడల కోర్టులను ఏర్పాటు చేశామన్నారు. వ్యాయామం ప్రతి ఒక్కరికీ అవసరమని, దీనికి ఎంతో దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా సమీప ప్రాంతాలలోనే ఏర్పాటు చేశామన్నారు. పనుల వేగం పెంచి త్వరతిగతిన పూర్తి చేయాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రుద్రగాని శ్రీదేవి, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, ఇంజినీర్లు పాల్గొన్నారు.