మామిళ్లగూడెం, మే 7: జిల్లాలో దళితబంధు లబ్ధిదారులకు యూనిట్లను సత్వరమే అందించేందుకు యూనిట్ గ్రౌండింగ్ సెక్టర్ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో దళితబంధు యూనిట్ల పంపిణీపై సంబంధిత అధికారులు, బ్యాంకర్లతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా రంగాలకు చెందిన యూనిట్ల గ్రౌండింగ్కు లబ్ధిదారుల ఖాతాలకు జమ చేసిన పైకానికి సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ యూనిట్ల పంపిణీని వేగవంతం చేయాలన్నారు. అనుభవం, డిమాండ్ లేని యూనిట్లను ఎంచుకున్న లబ్ధిదారులు పునరాలోచన చేసి యూనిట్లను మార్చుకున్న వారికి డిమాండ్, లాభసాటిగా ఉండే యూనిట్ల పట్ల సలహాలు సూచనలు చేయాలన్నారు.
ట్రాన్స్పోర్టు రంగానికి సంబంధించి మంజూరైన జేసీబీలు, హార్వెస్టర్లు, క్రేన్లు, ఆటోలకు సంబంధించి ఎన్ని యూనిట్లను లబ్ధిదారులకు అందించారు. ఇంకా రావాల్సిన యూనిట్లు పంపిణీకి సంబంధిత వెండర్స్, డీలర్స్తో చర్చించి త్వరితగతిన లబ్ధిదారుడికి అందించాలన్నారు. డెయిరీ యూనిట్లకు సంబంధించి షెడ్ల నిర్మాణం, పశుగ్రాసం పెంపకం, సొంత స్థలం లేని వారు లీజు అగ్రిమెంట్లు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. ఎలక్ట్రికల్, పెయింటింగ్, బ్రిక్స్ యూనిట్, ఆయిల్ మిల్స్, డాల్ మిల్స్, మొబైల్ టిఫిన్ సెంటర్లు, జ్యూస్ సెంటర్స్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డీటీపీ, సెంట్రింగ్ వంటి యూనిట్లను గ్రౌండింగ్కు సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, డీఆర్వో శిరీష, జడ్పీ సీఈవో అప్పారావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దశరథ్, కల్లూరు ఆర్డీవో సూర్యనారాయణ, పశుసంవర్ధకశాఖ జేడీ వేణుమనోహర్రావు, జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్, డీటీవో కిషన్రావు, ఎల్డీఎం చంద్రశేఖర్రావు, పీఆర్ ఈఈ శ్రీనివాస్, బ్యాంకర్లు పాల్గొన్నారు.
జిల్లా అధికారులతో
దళితబంధు పథకంలో ఎంపికైన లబ్ధిదారుల యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి సూచించారు. శనివారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఫైలెట్ ప్రాజెక్టులో ఎంపిక చేసిన చింతకాని మండలంతోపాటు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల ద్వారా ఎంపిక చేసి పంపించిన లబ్ధిదారులకు వెంటనే యూనిట్లను గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. లబ్ధిదారులకు ఆసక్తి ఉన్న రంగంలో వారిని మరింత ప్రోత్సహించి వారికి లాభం చేకూరే విధంగా యూనిట్లను ఎంచుకునేలా చూడాలన్నారు.