భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 11న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన ఖరారైందని కలెక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. శుక్రవారం ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్, ఎస్పీ రోహిత్రాజు, జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఆమె పలు సూచనలు చేశారు. సోమవారం సీఎం రేవంత్రెడ్డి , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర క్యాబినెట్ మంత్రులతో కలిసి భద్రాచలంలో పర్యటించనున్నట్లు తెలిపారు. ఉదయం సీతారామచంద్రస్వామిని దర్శించుకొని తర్వాత మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన జిల్లా అధికారుల సమీక్షా సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు. అక్కడే 3 వేల మంది సమక్షంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తారని, భోజన విరామం తర్వాత మణుగూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. హెలీపాడ్, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు. హెలీప్యాడ్ వద్ద అంబులెన్స్, డాక్టర్లు, ఫైరింజన్ తదితర అత్యవసర ఏర్పాట్లు చేయాలన్నారు. కల్యాణ మండపం వద్ద ఎలక్ట్రికల్, జనరేటర్, ఏసీల ఏర్పాటు, వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లను పర్యవేక్షించాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్లో డీఆర్వో రవీంద్రనాథ్, డీఆర్డీవో విద్యాచందన, జిల్లా పరిపాలనాధికారి గన్యా, డీఎంహెచ్వో శిరీష, డీఎస్వో రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.
మణుగూరుటౌన్, మార్చి 8 : ప్రజా దీవెన సభకు సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 11న మణుగూరుకు రానున్న నేపథ్యంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సభ ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హెలీప్యాడ్, ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో పార్కింగ్, సభ నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లను డీఎస్పీ రవీందర్రెడ్డితో కలిసి పరిశీలించారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ నాయకులు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.