రఘునాథపాలెం, మార్చి 25: జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) నిర్వహణ తీరుపై ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అవినీతి అక్రమాలకు తావులేకుండా సరైన పద్ధతుల్లో, రైతులకు సేవలందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. ఖమ్మంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో 128వ మహాజన సభ బుధవారం జరిగింది. పీఐసీ అధ్యక్షుడిగా ఆయన పాల్గొని మాట్లాడారు. సహకార సంఘాల్లో రైతుల వివరాల నమోదు చేసే సమయంలో పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇప్పటికే జరిగిన పొరపాట్లను 15 రోజుల్లో సవరించాలని ఆదేశించారు. లేనిపక్షంలో చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రైతులకు మంజూరు చేసిన రుణాల రికవరీపై వ్యవసాయ సంఘాలు దృష్టి సారించాలన్నారు. రైతులు స్వచ్ఛందంగా చెల్లింపులు చేసేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. అన్నదాతల ఆదాయం పెంచడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సహకార సంఘం ద్వారా వివిధ రకాల రుణాలను వినియోగిస్తూ రైతులు ఎలా ఆర్థికంగా మంచి స్థితికి చేరుకోవచ్చో అనే అంశంపై అవగాహన కల్పించడం కీలకమన్నారు. సాగు యంత్రీకరణ రుణాలు పంపిణీ చేయాలని, దీనివల్ల అధిక సంఖ్యలో పంటలు దిగుబడి వచ్చి రైతులకు లాభం చేకూరుతుందని అన్నారు.
వ్యవసాయంతోపాటు పాడి పశువుల పెంపకం, చేపల పెంపకం వంటి వివిధ వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా ఆదాయం సంపాదించుకోవడంపై రైతులను సహకార సంఘాలు ప్రోత్సహించాలని కోరారు. ముందుగా డిసెంబర్ 2025 త్రైమాసిక ముగింపు కాలంలో బ్యాంకు సాధించిన ప్రగతి, వివిధ అంశాల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. నాబార్డ్ డీడీఎం సుజిత్కుమార్, టీఎస్సీఏబీ డీజీఎం రవికాంత్రెడ్డి, జిల్లా సహకార అధికారి గంగాధర్, సీఈవోలు వెంకట ఆదిత్య, శ్రీనివాస్, పీఏసీఎస్ల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.