ఖమ్మం, ఫిబ్రవరి 24 : ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఇంటి, పంపు పన్నులు వసూళ్లను ముమ్మరం చేశారు. వందశాతం లక్ష్యాన్ని అధిగమించేందుకు అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అయితే, ఖమ్మం కార్పొరేషన్లో పన్నుల వసూలు సవాలే.. దీన్ని అధిగమించేందుకు పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు ఒక రెవెన్యూ అధికారి, ఇద్దరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, 24 మంది బిల్ కలెక్టర్లను బృందాలుగా ఏర్పాటు చేశారు. వీరిని పర్యవేక్షించేందుకు ఇంజినీరింగ్, టౌన్ప్లానింగ్ నుంచి 14మందిని స్పెషల్ అధికారులుగా నియమించారు. వీరంతా ఉదయం నుంచే ఇంటింటికీ తిరుగుతూ పన్నులు వసూలు చేయనున్నారు. కాగా, భద్రాద్రి జిల్లాలో ఈ నెలలో ఇంటి పన్నులు దాదాపు 60 శాతానికి పైగానే వసూలయ్యాయి.
ఖమ్మం నగరంలో ప్రతి సంవత్సరం ఆస్తి పన్నులు, పంపు బిల్లులు చెల్లించడం ఆనవాయితీ. దీనిలో భాగంగానే 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నుల వసూళ్లపై నగరపాలక అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో దృష్టిసారించింది. మార్చి 31వ తేదీ లోపు ఆస్తి పన్ను, పంపు బిల్లులు చెల్లించిన వారికి ఎలాంటి అపరాధ రుసుం ఉండదన్న ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కార్యాచరణను ముమ్మరం చేసింది. ప్రధానంగా ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ ఆదర్శ్ సురభి పర్యవేక్షణలో రెవెన్యూ విభాగం అధికారులు, బిల్ కలెక్టర్లు పక్కా ప్రణాళికను రూపొందించుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరంలోని 60డివిజన్ల పరిధిలో పర్యటిస్తున్నారు. పన్నుల చెల్లింపు ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తూనే తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నారు. కాగా ఈ ఏడాది నగరంలో ప్రభుత్వ, ప్రైయివేట్ ఆస్తులకు సంబంధించి దాదాపు రూ.29 కోట్ల 15లక్షలు వసూళ్లు చేయాల్సి ఉంది. పంపు బిల్లులు దాదాపు రూ.8 కోట్లు వసూళ్లు చేయాలి. ఈ రెండూ కలిపితే మొత్తం రూ.37 కోట్ల 15 లక్షలు పన్నులు వసూళ్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
రూ.29.15 కోట్ల ఇంటిపన్నుల వసూళ్ల లక్ష్యం
ఖమ్మంలో ఆస్తిపన్నుల వసూళ్లు అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కార్పొరేషన్ సిబ్బంది అడుగుపెట్టిన వెంటనే రకరకాల ఒత్తిళ్లు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాదికి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అధిగమించేందుకు నగరపాలక కమిషనర్ ఆదర్శ్ సురభి, రెవెన్యూ విభాగం అధికారి(ఆర్వో) కే శ్రీనివాస్ సంయుక్తంగా పకడ్బందీ కార్యాచరణ రూపొందించారు. తాజాగా అందిన లెక్కల ప్రకారం నగరంలో 75,742 అస్సెస్మెంట్స్(గృహాలు )ఉన్నాయి. వాటిలో 66,136 నివాస గృహాలు కాగా, 5,266 నాన్ రెసిడెన్షియల్, 4,338 మిక్సిడ్ రెసిడెన్స్ ఉన్నవి.. వీటి నుంచి మొత్తం ఇంటి పన్నులు రూ.29కోట్ల 15 లక్షలు వసూలు చేయాల్సి ఉండగా గురువారం నాటికి 16కోట్ల 61లక్షలు మాత్రమే వసూలు చేశారు. మిగిలిన బకాయిలు మొత్తం మార్చి 31లోపు వసూలు చేసేలా ప్రణాళికను రూపొందించారు.
రూ.8 కోట్ల పంపుబిల్లుల వసూళ్ల లక్ష్యం
ఖమ్మం కార్పొరేషన్లో పాత పంపు కనెక్షన్లు 35వేలు ఉండగా మిషన్ భగీరథ ద్వారా 40వేల గృహాలకు పంపు కలెక్షన్లు ఇచ్చారు.మొత్తం 75వేల పంపు కలెక్షన్లు ఉన్నవి.. వీటి నుంచి దాదాపు రూ.8 కోట్ల పంపు పన్నులు వసూలు చేయాల్సి ఉండగా గురువారం నాటికి ఒక కోటి 50 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేశారు.
నేటి నుంచి స్పెషల్ డ్రైవ్
ఖమ్మం కార్పొరేషన్లో ఇంటి, పంపు పన్నులు వసూలు చేసేందుకు కమిషనర్ ఆదర్శ్ సురభి ఈ నెల 25వ తేదీ నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. పన్నుల వసూళ్లలో వందశాతం లక్ష్యాన్ని అధిగమించేందుకు ఒక రెవెన్యూ అధికారి, ఇద్దరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, 24 మంది బిల్ కలెక్టర్లు బృందాలుగా ఏర్పాటు చేశారు. వీరిని పర్యవేక్షించేందుకు ఇంజినీరింగ్, టౌన్ప్లానింగ్ అధికారులు 14మంది స్పెషల్ అధికారులుగా నియమించారు. ప్రతిరోజు ఉదయం 7గంటల నుంచే డివిజన్లలో ఉండేలా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. మైక్ల ద్వారా ఆయా డివిజన్లలో ప్రచారం చేయాలని చెప్పారు. ఏ బిల్ కలెక్టర్ ఆ రోజు ఎంత కలెక్షన్ చేసిందో అదే రోజు కమిషనర్ సాయంత్రం సమీక్షిస్తున్నారు. మార్చి 31వరకు బిల్ కలెక్టర్లకు, రెవెన్యూ సిబ్బందికి కమిషనర్ సెలవులు రద్దు చేశారు. ఇంటి పన్నులు చెల్లించని 800 మందికి నోటీసులు ఇచ్చారు. వీరికి ఇచ్చిన గడువులోగా పంపు పన్నులు చెల్లించకపోతే ఇంజినీరింగ్ లైన్మెన్ల ద్వారా పంపు కలెక్షన్ను కట్ చేసేలా ఆదేశాలు ఇచ్చారు.
సత్తుపల్లి, మధిర, వైరాలో..
సత్తుపల్లి మున్సిపాలిటీలో మొత్తం 9,182 అస్సెస్మెంట్స్ ఉండగా వీటిలో కమర్షియల్ భవనాలు 1,236 ఉన్నాయి. మొత్తం పన్నులు రూ.3.46 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా శుక్రవారం నాటికి రూ.2.70 కోట్లు వసూలు చేశారు. అదేవిధంగా మొత్తం 5,525 నల్లా కలెక్షన్లు ఉండగా వీటికి గాను రూ.94 లక్షలు వసూలు చేయాల్సి ఉండగా రూ.70 లక్షలు వసూలు చేశారు. మిగిలినవి మార్చి 31 వరకు వసూలు చేసేలా అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
మధిర మున్సిపాలిటీలో మొత్తం 8,295 అస్సెస్మెంట్స్ ఉండగా వీటిలో కమర్షియల్ భవనాలు 509 ఉన్నవి, ఈ మొత్తానికి గాను రూ.2.47 కోట్లు ఇంటి పన్నులు వసూలు చేయాల్సి ఉండగా శుక్రవారం నాటికి రూ.1.21 కోట్లు వసూలు చేశారు. ముధిర మున్సిపాలిటీలో 5,026 నల్లా కలెక్షన్లు ఉండగా వీటికి గాను మొత్తం రూ.48.87 లక్షలు వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.22.95 లక్షలు వసూలు చేశారు.
వైరా మున్సిపాలిటీలో 7,118 అస్సెస్మెంట్స్ ఉండగా వీటిలో కమర్షియల్ భవనాలు 276 ఉన్నాయి. వీటికిగాను ఇంటి పన్నులు మొత్తం రూ.కోటి 93 లక్షలు వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 92లక్షల 35వేల రూపాయాలు వసూలు చేశారు.
పన్నులు చెల్లించడం బాధ్యత..
నగరం అభివృద్ధి చెందాలంటే ఆస్తి పన్నులు చెల్లించాలి. ప్రజలు చెల్లిస్తున్న ప్రతి రూపాయిని వారికోసమే ఖర్చుచేయడం జరుగుతుంది. కనీస మౌలిక వసతులు మెరుగుపడతాయి. తెలంగాణలో హైదరాబాద్ తరువాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం ఖమ్మం… అలాంటి ఖమ్మంలో మరింత అభివృద్ధి జరగాలంటే ప్రజల సహకారం అవసరం. ప్రజలు వారు చెల్లించాల్సిన ఇంటి, పంపు పన్నులు సకాలంలో చెల్లిస్తే అభివృద్ధికి సహకరించిన వారు అవుతారు.
– ఆదర్శ్ సురభి, కమిషనర్, ఖమ్మం కార్పొరేషన్