ఖమ్మం : కేసీఆర్ పాలన దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలలో భాగంగా ఖమ్మం వీడీవోస్ కాలనీ క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను మంత్రి పువ్వాడ ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి సర్కిల్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్స్లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటిని సమన్వయ పరిచి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు విరివిగా అందిస్తున్నామన్నారు.
దేశానికే సరికొత్త అభివృద్ధి నమూనాను అందించే దక్షత ముఖ్యమంత్రి కేసీఆర్ది అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది ఏండ్లు పూర్తి చేసుకొని ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్న రాష్ట్ర ప్రజలకు మంత్రి పువ్వాడ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం ఏర్పడితే విద్యుత్ ఉండనే ఉండదు అనుకున్న వారికి విద్యుత్ పోనే పోదు అనే వరకు చేరిందంటే ఆ ఘనత ముమ్మాటికి ముఖ్యమంత్రి కేసీఆర్ దే నని ఆయన కితాబిచ్చారు.
అంతే గాకుండా 24 గంటలు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రం గా తెలంగాణా గణతి కెక్కిందన్నారు.పైగా వ్యవసాయానికి 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ నందిస్తున్న ఏకైక రాష్ట్రం గా రికార్డుల కెక్కిందని ప్రశంసించారు. రైతుబంధు, రైతు బీమా పథకాలు యావత్ భారతదేశంలోనే చరిత్ర సృష్టించాయన్నారు. రాష్ట్ర ఏర్పాటును జీర్ణించుకోలేని శక్తులే విమర్శలకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు. రాజకీయలకతీతంగా సీఎం కేసీఆర్కు తోడ్పాటునందించాలని పువ్వాడ పిలుపునిచ్చారు.