ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరిస్తున్నారు.. అవసరమైన మేరకు అత్యాధునిక సాంకేతిక యంత్రాలను సమకూరుస్తున్నారు.. ఓపీ ఎక్కువ ఉన్న సెంటర్లను గుర్తించి వాటిని అప్గ్రేడ్ చేస్తున్నారు.. పాత భవనాల స్థానంలో కొత్త భవనాలను నిర్మిస్తున్నారు.. దీనిలో భాగంగా సాధారణ ప్రసవాలు, అత్యవసర శస్త్రచికిత్సలకు పేర్గాంచిన పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ఆధునీకరించనున్నారు. రూ.7.50 కోట్ల్ల నిధులతో ప్రభుత్వాసుపత్రి నిర్మించనున్నారు.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ భవన సముదాయ నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి శంకుస్థాపన చేయనున్నారు.
పెనుబల్లి, ఏప్రిల్ 23 : కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుతుండటంతో పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లేందుకు రోగులు మక్కువ చూపుతున్నారు. మండలంలోని 40 కిలోమీటర్ల పరిధి నుంచి రోగులు ఆస్పత్రికి నిత్యం వస్తున్నారంటే అక్కడ సేవలు ఏ స్థాయిలో అందుతున్నాయో అర్థమవుతున్నది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు, ప్రసవాల కోసం గర్భిణులు, ఆరోగ్య పరీక్షలకు బాలింతలు, విషజ్వరాలు, దీర్ఘకాలిక రోగాలతో సతమతమయ్యేవారు నిత్యం వస్తుండటంతో ఆస్పత్రి కిటకిటలాడుతున్నది. అంతేకాక అరుదైన శస్త్ర చికిత్సలకు ఈ ఆస్పత్రి పేరుగాంచింది. భారీ కణుతులు తొలగిస్తూ, మోకాలి ఆపరేషన్లు చేస్తూ వైద్యులు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తున్నారు. కరోనా కష్టకాలంలోనూ ఈ ప్రాంత ప్రజలకు ప్రాణదాతగా నిలిచి చికిత్సలు అందించిందీ ఆస్పత్రి. ఇలాంటి వైద్యశాలను అభివృద్ధి చేయాలనే దృఢ నిశ్చయంతో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య రూ.7.50కోట్లు మంజూరు చేయించారు.
స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో 1977, నవంబర్ 14న ఆస్పత్రిని ప్రారంభించారు. దీనికి చైర్మన్గా మాజీ మంత్రి జలగం ప్రసాదరావు ఉన్నారు. ఆస్పత్రి అభివృద్ధికి ప్రముఖ సీనియర్ నటి వాణీశ్రీ రూ.లక్ష, నిజాం చారిటబుల్ ట్రస్టు రూ.2లక్షల విరాళాలు అందించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెనుబల్లి వైద్యశాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
రోజూ 100 నుంచి 150 వరకు ఓపీ ఉంటుంది. ఆస్పత్రి వైద్యులు పరీక్షల అనంతరం రక్త పరీక్షలు చేయించి ఉచితంగా మందులు అందిస్తారు. వ్యాధి తీవ్రతనుబట్టి ఆస్పత్రిలో చేర్పించుకుని నిత్యం పర్యవేక్షిస్తారు. వైద్యశాలలో ఉండే రోగులకు రోజూ భోజనం, పాలు, బ్రెడ్, గుడ్డు అందిస్తారు.
వైద్యశాలకు వచ్చే గర్భిణులకు సాధారణ ప్రసవాలు చేసేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రసవం అనంతరం వారికి కేసీఆర్ కిట్తోపాటు ప్రత్యేక వాహనంలో ఇంటికి పంపిస్తున్నారు. పరీక్షల కోసం వచ్చే గర్భిణులకు ఆరోగ్య సూచనలు అందిస్తున్నారు.
కరోనా కాలంలో ఎమ్మెల్యే చొరవతో 25 బెడ్లను ఏర్పాటు చేశారు. రోగులకు అత్యవసరంగా ఆక్సిజన్ అందే విధంగా 25 ఆక్సిజన్ సిలిండర్లను అమర్చారు. రోజూ పరీక్షలు చేయడం, కరోనా నిర్ధారణ అనంతరం ప్రత్యేక బెడ్లపై చికిత్స అందించడం, వెంటిలేటర్లను అందుబాటులో ఉంచేలా కృషి చేశారు. అలాగే కరోనా రోగులకు ఎమ్మెల్యే సండ్ర భోజన సదుపాయం కల్పించారు. పేదలకు పైసా ఖర్చు లేకుండా ప్రాణాలను కాపాడే భరోసా ఇచ్చారు.
స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రారంభించిన వైద్యశాలకు ఎమ్మెల్యే సండ్ర పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందజేస్తూ అభివృద్ధి చేస్తున్నారు. వైద్యులను నిత్యం అందుబాటులో ఉంచి కరోనా సమయంలో బెడ్లను ఏర్పాటు చేసి పైసా ఖర్చు లేకుండా ప్రాణాలను కాపాడారు. వైద్యశాలలో 30 బెడ్ల ఏర్పాటు కొరకు, ఆధునికీకరణకు రూ.7.50కోట్లు మంజూరు చేయించడం పట్ల ఎమ్మెల్యే సండ్రకు మండల ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆస్పత్రి ఆధునికీకరణ పనులకు సోమవారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేయనున్నారు.