ఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 10: వరుసగా మూడురోజులు సెలవుల అనంతరం ఖమ్మం ఏఎంసీ మిర్చియార్డులో సోమవారం క్రయవిక్రయాలు పునఃప్రారంభమయ్యాయి. శుక్రవారం గుడ్ఫ్రైడే, శని, ఆదివారాలు వారంతపు సెలువులు కావడంతో ఆ ప్రభావం పంట ఉత్పత్తుల రాకపై కనిపించింది. మంచి సీజన్ కావడం, మార్కెట్లో మిర్చి పంటకు అధిక ధర పలుకుతుండడంతో రైతులు ఇదే అదునుగా భావించి భారీ మొత్తంలో పంట ఉత్పత్తులను మార్కెట్కు తీసుకొచ్చారు. సోమవారం ఉదయం జెండాపాట సమయానికి వివిధ జిల్లాల నుంచి రైతులు 50,165 బస్తాలను తెచ్చారు. దీంతో యార్డులో ఎటుచూసినా ఎర్రబంగారమే కనిపించింది. అనంతరం జరిగిన జెండాపాటకు హాజరైన మార్కెట్ కమిటీ చైర్పర్సన్.. పాట నిర్వహణ, క్రయవిక్రయాలను పరిశీలించారు. జెండాపాటలో తేజా రకం పంటకు క్వింటాకు రూ.23,600 ధర పలికింది. మధ్య ధర రూ.21 వేలు, కనిష్ట ధర రూ.17 వేలు, తాలు రకం గరిష్ట ధర రూ.15 వేలు, కనిష్ట ధర రూ.9 వేల చొప్పున నిర్ణయించి ఖరీదుదారులు పంటలను కొనుగోలు చేశారు.