ఖమ్మం కల్చరల్ నవంబర్ 23: ఔను, వచ్చే నెల 4వ తేదీ.. నిజంగానే ‘భలే మంచి రోజు’..! ఆ రోజున.. ఘంటసాల పాటలతో వీనుల ‘విందు’ను పసందుగా ఆస్వాదించొచ్చు. అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి సందర్భంగా సుధాస్ ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో వచ్చే నెల 4న నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ‘భలే మంచి రోజు’ పేరుతో మధుర గాన వాహిని కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ టి.వాసుదేవ్, శఠగోపం సుదర్శన్, ప్రోగ్రాం కన్వీనర్ పంచాంగం విజయసారథి తెలిపారు.
ఈ ‘పాటల పండుగ’ వివరాలను నగరంలోని గ్రాండ్ గాయత్రి హాల్లో బుధవారం విలేకరుల సమావేశంలో వారు వెల్లడించారు. తమ సంస్థ గత 26 సంవత్సరాలుగా ‘భలే మంచి రోజు’ పేరుతో ఘంటసాల సంగీత విభావరిని నిర్వహిస్తున్నదని చెప్పారు. గాన గంధర్వుడు ఘంటసాల శత జయంతి వేడుకలను ఈ సంవత్సరం మరింత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ వేడుకలో ప్రత్యేక అతిథులుగా పద్మభూషణ్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించిన సినీ నేపథ్య గాయని పి.సుశీల, సినీ నటుడు సుమన్ పాల్గొంటారని తెలిపారు. గాయని సుశీల 1978లో ఒకసారి ఖమ్మం వచ్చారని, ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు రానున్నారని చెప్పారు. ఆ వేడుక వేదికపై ఆమెకు ఘంటసాల శత జయంతి పురస్కారాన్ని ప్రదానం చేస్తామన్నారు. ఐఏఎస్ అధికారులు ఎం.రఘునందన్రావు, హెచ్.అరుణ్కుమార్, కలెక్టర్ వీపీ గౌతమ్, ఐఆర్ఎస్ రవి, చిత్ర నిర్మాత ప్రేమ్కుమార్ కూడా పాల్గొంటారని తెలిపారు. ఈ ఉత్సవంలో ఘంటసాల ఆలపించిన అర్థశత గీతాలను రాష్ట్ర, జాతీయ స్థాయి సినీ నేపథ్య గాయకులు ఆలపించి మైమరిపిస్తారని చెప్పారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు
ఈ ‘పాటల పండుగ’.. ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారు. స్థానిక గాయకులతో ‘ఘంటసాల గాన స్వర సుధ’ కార్యక్రమం ఉంటుందన్నారు. సాయంత్రం 5.00 గంటల నుంచి ప్రముఖ గాయకులు బీఏ నారాయణ, అరుణ్కుమార్, వినోద్బాబు, పవన్, ప్రణవి, శ్రీలలిత, పంచాంగం తపసిజ మైథిలి, పంచాంగం దివ్య సుశోఖిత, ఎస్వీ రమణ తదితర గాయకులు ఘంటసాల పాటలను ఆలపిస్తారని వివరించారు. ప్రముఖ నర్తకి తిరుమల కాండూరి గాయత్రిచే ఘంటసాల సంగీత నృత్య విలాస ప్రదర్శన ఉంటుందని తెలిపారు. సంగీత ప్రియులు, ఘంటసాల అభిమానులంతా ఈ సంగీత విభావరిని విజయవంతం చేయాలని కోరారు. ఈసందర్భంగా ఘంటసాల శత జయంతి భలే మంచి రోజు బ్రోచర్ను ఆవిష్కరించారు. మహ్మద్ అజీజ్, మహ్మద్ జాన్సాహెబ్, ఎస్వీ రమణ, రవికుమార్ పాల్గొన్నారు.