ఖమ్మం: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న నిరుపేద విద్యార్ధులకు బస్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఖమ్మంలోని వైఎస్ఆర్ నగర్ కాలనీ డబుల్ బెడ్ రూమ్ ప్రాంతం నుంచి రోటరీనగర్, ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సుమారు 500 మంది విద్యార్ధినీ, విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సును టీఎస్ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. శనివారం ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ విద్యార్ధులందరికీ బస్ పాస్లు అందచేసి అనంతరం విద్యార్ధులతో పాటు బస్సులో ప్రయాణించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నిరుపేద విద్యార్ధులు ఆర్ధిక పరిస్థితులు అంతంత మాత్రమే ఉన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మంత్రి పువ్వాడ వారికోసం ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సౌకర్యాన్ని ప్రతివిద్యార్ధి సద్వినియోగం చేసుకొని తల్లిదండ్రుల ఆశయాలను సాధించేలా కష్టపడి చదువుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్, హరి, రాము, బిచ్చు , రామకృష్ణ, ఇసుఫ్, రాము తదితరులు పాల్గొన్నారు.