ఖమ్మం, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టను దిగజార్చాలనే పథక రచన చేసి.. రేవంత్ సర్కారు ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ కుట్ర కోటలు బద్దలయ్యాయని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అపర భగీరథుడిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేక అబద్ధపు విచారణ కమిషన్లతో బద్నాం చేయాలని చూసిన స్కాంగ్రెస్కు న్యాయస్థానం సాక్షిగా గట్టి చెంప దెబ్బ తగిలిందన్నారు. ప్రతీ తెలంగాణ బిడ్డ గుండెల్లో ఉద్యమ సెగ రగిలించి, ఢిల్లీ పీఠాన్ని కదిలించి స్వరాష్ర్టాన్ని సాధించిన చరిత్రకు ఆయనే సాక్ష్యమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ, ఆంధ్రా మీడియా అందరూ కలిసి తప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ, కేసీఆర్ పవిత్రత మరోసారి రుజువైందని ఆయన స్పష్టం చేశారు.
నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఫ్లోరోసిన్ రక్కసితో వేలాది మంది జీవితాలు చితికిపోతుంటే.. యాభై ఏండ్లు రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ గాడిద పండ్లు తోముకుంటూ కూర్చున్నదని తాతా మధు ధ్వజమెత్తారు. ఉద్యమ సమయంలో కాళ్లు వంకర్లు పోయి, యవ్వనంలోనే ముసలి వాళ్లుగా మారి, పెళ్లిళ్లకు కూడా నోచుకోని ప్రజానీకాన్ని చూసి చలించిపోయిన కేసీఆర్.. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. స్వచ్ఛమైన తాగునీరు అందించి ఫ్లోరోసిస్ వ్యాధిని తరిమికొట్టి చరిత్ర సృష్టించారన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం బహుళార్థసాధక ప్రాజెక్టును కేవలం మూడేళ్లలో పూర్తిచేసి పచ్చని పొలాలతో తెలంగాణ రాష్ర్టాన్ని కోటి ఎకరాల మాగాణిగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. మేడిగడ్డలో కేవలం రెండు పిల్లర్లు కుంగితే, మరమ్మతులు చేయకుండా కూలేశ్వరం అంటూ కాంగ్రెస్ విష ప్రచారం చేసిందని మండిపడ్డారు. నీటిని నిల్వచేసే తెలివి లేక, మేడిగడ్డ గేట్లు అన్నింటినీ ఎత్తి నీటిని దిగువకు వదిలి తెలంగాణలో ఈరోజు నీటి కరువు తెచ్చిన ద్రోహి రేవంత్రెడ్డిది అని ధ్వజమెత్తారు.
తెలంగాణ రైతును రాజుగా చూడాలని, వ్యవసాయాన్ని పండుగలా మార్చాలన్నదే మాజీ సీఎం కేసీఆర్ ఆశయమని తాతా మధు అన్నారు. అందుకే బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు, రైతుబీమా వంటి పథకాల్ని అమల్లోకి తెచ్చారన్నారు. కానీ, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లు గడిచినప్పటికీ రైతుబంధు ఇవ్వడం లేదన్నారు. వరి, మక్కలు కొనుగోలు చేసే పరిస్థితి కనిపిస్తలేదన్నారు. పాలన చేతగాని కాంగ్రెస్సోళ్లు కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావుని ఇబ్బంది పెట్టేందుకు విచారణ కమిషన్లను ఏర్పాటు చేసి కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపారని మండిపడ్డారు. రేవంత్కు పాలనకంటే.. బూతులు మాట్లాడటం, పక్క రాష్ర్టాలతో చీకటి ఒప్పందాలు చేసుకోవడం మీదనే ఆసక్తి ఎక్కువగా ఉందన్నారు. రైతాంగంతోపాటు అన్ని వర్గాలను నట్టేట ముంచిన రేవంత్ సర్కారు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. హైకోర్టు తీర్పును బీఆర్ఎస్ జిల్లా కమిటీ స్వాగతిస్తోందని, కుట్రలు, కుతంత్రాలు ఎన్ని చేసినా అంతిమంగా ధర్మమే గెలిచిందన్నారు. డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, ఖమ్మం రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, సీనియర్ నాయకులు, ఉద్యమకారులు ఉప్పల వెంకటరమణ, తాజుద్దీన్, ముత్యాల వెంకటప్పారావు, పగడాల నరేందర్, లింగనబోయిన సతీశ్, ఈదుల రాజేశ్, బెల్లంకొండ గోపి, మహ్మద్ రఫీ, కృష్ణప్రసాద్, పోలెపొంగు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.