ఖమ్మం, నవంబర్ 28: ఖమ్మం నియోజకవర్గంలో తన గెలుపు నవశకానికి నాంది అవుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ గెలుపు మరింత అభివృద్ధికి మలుపు అవుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో మంగళవారం 3 వేల బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి బీఆర్ఎస్ అభ్యర్థి అజయ్కుమార్ మాట్లాడారు. తమ విజయం ప్రత్యర్థులకు కనిపించేలా తమ పార్టీ చేపట్టిన మోటర్ సైకిల్ ర్యాలీ అద్భుతంగా ఉందని అన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో హాజరై ఈ ర్యాలీని విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు, ప్రజలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. అయితే ఇటీవల ఎవరో వ్యక్తి తన పేరుతో ఖమ్మం ప్రజలకు వాయిస్ కాల్స్ పంపిస్తున్నారని అన్నారు.
సూట్కేస్ గుర్తుకు ఓటేయాలంటూ అందులో చెబుతూ ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇలా ఎవరో వ్యక్తుల పేర్లతో, మాటలతో తన ప్రత్యర్థులే ఇలాంటి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి తప్పుడు విధానాలతో తన విజయాన్ని అడ్డుకోలేరనే విషయాన్ని వచ్చే నెల 3న ఇక్కడి ప్రజలు అర్థమయ్యేలా చెబుతారని అన్నారు. ఇలాంటి తప్పుడు విధానాలను ప్రజలు గమనించి ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో సమాధానం చెప్పాలని ప్రజలను కోరారు. 30న మన వేలికి ఇంకు, 3న ఖమ్మంలో పింకు ఖాయమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా పని చేశారని అన్నారు. ప్రజలు కూడా కారు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పునుకొల్లు నీరజ, ఆర్జేసీ కృష్ణ, కూరాకుల నాగభూషణం, దోరేపల్లి శ్వేత, అమరగాని వెంకన్న, బచ్చు విజయ్కుమార్, జహీర్ అలీ, చిన్ని కృష్ణారావు, పల్లా రాజశేఖర్, నాగరాజు, మెంతుల శ్రీశైలం, కోదాటి గిరి పాల్గొన్నారు.
ఖమ్మం నగరంలో మూడు వేల బైకులతో బీఆర్ఎస్ నిర్వహించిన భారీ ర్యాలీ నగర ప్రజలను ఆకట్టుకుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెవిలియన్ గ్రౌండ్ దగ్గర మొదలైన ఈ ర్యాలీ జడ్పీ సెంటర్, బోనకల్లు క్రాస్రోడ్, ముస్తాఫానగర్, చర్చీకాంపౌండ్, ప్రకాశ్నగర్, గాంధీచౌక్, శివాలయం రోడ్, జూబ్లీ క్లబ్, బస్ డిపోరోడ్, రాపర్తినగర్, ఎన్టీఆర్ మార్గ్, ఇల్లెందు సరిల్, ఇందిరానగర్ సరిల్ మీదుగా మమత వైద్యశాల మైదానం వరకూ చేరుకుంది.