భద్రాచలం, ఏప్రిల్ 10 : వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామ నవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు భద్రాచలం సీతారామచంద్రస్వామి దివ్యక్షేత్రంలో బుధవారం రెండో రోజుకు చేరాయి. ఉదయం స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు మండలావాహన, కుంభావాహన, చతుస్థానార్చన, దేవతావాహన తదితర కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం యాగశాలలో సంప్రదాయబద్ధంగా హోమం నిర్వహించిన అర్చకులు తాతగుడి సెంటర్ వరకు తిరువీధి సేవ జరిపారు.
ఇప్పటికే ఖమ్మం, కొత్తగూడెం రైల్వేస్టేషన్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ర్టాల్లో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఫ్లెక్సీలు, ఆర్చీలు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో కరపత్రాలను అతికించారు. మిథిలా స్టేడియంలో భక్తులు స్వామివారి కల్యాణాన్ని వీక్షించేందుకు 26 సెక్టార్లను ఏర్పాటు చేశారు. సెక్టార్లలోని భక్తులకు మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు అందించేందుకు భద్రాచలం ఆర్డీవో దామోదరరావు సమావేశం నిర్వహించి.. అధికారులకు స్వచ్ఛంద సంస్థల సభ్యులు సహకరించాలని సూచించారు. ముఖ్యంగా శానిటేషన్ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావును ఆదేశించారు. సెక్టార్లలో ఎప్పటికప్పుడు ఖాళీ వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు ఉండకుండా చూడాలని, అలాగే పట్టణాన్ని జోన్లుగా విభజించి ఎప్పటికప్పుడు చెత్తను ఏరివేసి శుభ్రంగా ఉంచాలన్నారు. 24 గంటలపాటు పారిశుధ్య సిబ్బంది మూడు షిప్టుల్లో పని చేసే విధంగా చూడాలని చెప్పారు. ఇప్పటికే పట్టణంలోని ప్రధాన వీధులు, శివారు ప్రాంతాల్లో స్వాగత ద్వారాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. చలువ పందిళ్లు, చాందినీ వస్ర్తాలతో షామియానాలు వేశారు.