భద్రాచలం, ఏప్రిల్ 11 : భద్రాద్రి రామాలయంలో ఉగాది రోజున ప్రారంభమైన వసంత పక్ష ప్రయుక్త శ్రీరామ నవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు గురువారం మూడో రోజుకు చేరాయి. అర్చకులు ఉదయం ఉత్సవ పెరుమాళ్లకు ప్రాకార మండపంలో ఏకాంతంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకు ప్రతిరోజూ స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం చేపడతారు. ఈ క్రమంలో వేదస్వస్తి, వేదశాస్త్ర ఇతిహాస పురాణాధుల పారాయణం గావించారు. యాగశాలలో చక్రాబ్జ మండల రచన(బియ్యంతో రంగురంగుల చక్రం చిత్రం) చేశారు. అనంతరం యాగశాల మధ్యలో మహా కుంభాన్ని ప్రతిష్ఠించి రామయ్యను ఆవాహన చేశారు. పంచ వింశతి వెండి పాలికలను ఉంచి ఆయా దేవతలను ఆవాహన గావించారు. గురువారం నుంచి బింబం, కుంభం, మండలం, అగ్నితో చతుఃస్థానార్చన చేశారు. సాయంత్రం స్వామివారికి రాజాధి వాహనంపై తిరువీధి సేవ జరిపారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం జీయర్ మఠంలో గరుడ ధ్వజ పటాన్ని చిత్రీకరించనున్నారు. సాయంత్రం ప్రత్యేక పూజలు చేసిన తర్వాత గరుడ ధ్వజ పటానికి గరుడాది వాసం నిర్వహిస్తారు.