కారేపల్లి,సెప్టెంబర్ 20 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో గల అన్ని గ్రామాలకు చెందిన సాగు భూములకు గోదావరి జలాలు అందించేందుకు సీతారామ ప్రాజెక్టు కాలువల నిర్మాణం చేపట్టాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రైతులతో కలిసి రేలకాయలపల్లి రెవెన్యూ పరిధిలో జరుగుతున్న సీతారామ ప్రాజెక్టు కాలువల నిర్మాణం పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన దగ్గరనుంచి ఖమ్మం జిల్లాలోని కారేపల్లి, కామేపల్లి మండలాల్లో సాగు భూములకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సాగునీటి సౌకర్యం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులు, నైజాం కాలంలో నిర్మించిన కుంటలు వర్షా ఆధారంగా పంటలు సాగు చేసుకుంటున్న రైతులకు గోదావరి జలాలు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, 2016 ఫిబ్రవరి నెలలో నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు(కెసిఆర్) సీతారామ ప్రాజెక్టు కు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. దాంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రోల్లపాడు నుంచి ఖమ్మం జిల్లా కారేపల్లి, కామేపల్లి మండలాలకు సాగునీరు ఇచ్చే విధంగా డిజైన్ రూపకల్పన చేయగా తర్వాత కాలంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మార్చేసి రేలకాలయలపల్లి రెవెన్యూ పరిధిలో అండర్ టెనెల్ నిర్మాణం చేయడం ద్వారా క్రింది భాగానికి నీరు తరలించి కామేపల్లి మీదగా మహబూబాబాద్ జిల్లా గార్ల,డోర్నకల్ మీద గా పాలేరు రిజర్వాయర్ కు తరలిస్తున్నారన్నారు.
దీనివల్ల కాలువలు నిర్మాణం కారేపల్లి మండలంలో రేలకాయలపల్లి, చీమలపాడు , బాజుమల్లాయిగూడెం, పాటిమీదగంపు నుంచి వెళ్లిన సాగునీరు మాత్రం కారేపల్లి మండలానికి అందే అవకాశం లేదన్నారు. సీతారామ ప్రాజెక్ట్ డిజైన్ లో కారేపల్లి మండలంలో ఉన్న సాగు భూములకు సాగునీరు అందించేందుకు కాలువల నిర్మాణం కోసం డిజైన్ చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి మండల భూములకు సాగునీటి కోసం కార్యాచరణ రూపొందించి రైతు ఉద్యమం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దుగ్గి కృష్ణ సిఐటియు జిల్లా నాయకులు కుందనపల్లి నరేంద్ర, రైతు సంఘం మండల కార్యదర్శి వజ్జా రామారావు, మాజీ సర్పంచ్ లు భూక్యా రమణ, బానోతు సక్రామ్, రైతులు పిప్పల కృష్ణ, తార చందు, అజ్మీరా శోభన్, బుడిగె వెంకన్న, నరసింహారావు, రాజయ్య, ఎర్రిపోతు భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.