Boggula Srinivas : తెలుగు సాహిత్యంలో ప్రముఖ రచయితగా పేరొందిన బొగ్గుల శ్రీనివాస్ (Boggula Srinivas) అకాల మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్లోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఆయన మృతి చెందారని స్థానికులు చెబుతున్నా.. శ్రీనివాస్ తల, ముఖం, ఎడమ చేతిపై గాయాలు ఉండడం సందేహాలకు తావిస్తోంది. దాంతో, శ్రీనివాస్ను హత్య చేసి.. ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని కుటుంబ సభ్యులు కూసుమంచి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పాలేరు రిజర్వాయర్లోకి కారు దూసుకెళ్లడంతో.. బొగ్గుల శ్రీనివాస్(49) చనిపోయారని వార్తలు వచ్చాయి. అయితే.. స్థానిక జాలర్లు తెలిపిన వివరాల ఆధారంగా శ్రీనివాస్ సోదరుడు బొగ్గుల అబ్దులయ్య శనివారం కూసుమంచి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ సోదరుడి మృత దేహంపై గాయాలు ఉన్నందున అనుమానాస్పద హత్యగా కేసు నమోదు చేయించారు. ఆయన చెప్పిన విషయాల ఆధారంగా ఎస్ఐ నాగరాజు ఎఫ్ఐఆర్ కాపీలో వెల్లడించిన వివరాలివి.
శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో నాయకన్ గూడెం నుంచి వేగంగా వచ్చిన కారు రోడ్డు మీద నుంచి పాలేరు రిజర్వాయర్లో పడింది. కారు రిజర్వాయర్లో పడుతుండగానే డ్రైవర్ దూకేసి పరయ్యాడు. నీళ్లలో పడిన కారును గమనించిన జాలర్లు పరుగున వెళ్లి చూడగా.. వెనక సీట్లో ఒక వ్యక్తి గాయాలతో ఉన్నాడు. అతడిని బయటకు తీసుకొచ్చి.. చూసేసరికి అతడు చనిపోయి ఉన్నాడు.
కారు విషయానికొస్తే.. AP16DP 2345 అనే నంబర్ ప్లేటున్న మహీంద్రా కేయూవీ, కే8 రకం. కారు డాష్ బోర్డులో కొన్ని పేపర్లు ఉన్నాయి. వాటిలో మేకల వేణు మాధవ రెడ్డి పేరు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్.. ఖాతా పుస్తకం దొరికాయి. కారు వెనక సీటుపై కవరులో ఆధారు కార్డు లభించింది. అందులో బొగ్గుల శ్రీనివాస్ అని ఉంది. నేలకొండపల్లి ఆస్పత్రిలో బొగ్గుల అబ్దులయ్య తన సోదరుడు బొగ్గుల శ్రీనివాస్ మృత దేహాన్ని గుర్తించారు. అయితే.. తల, ముఖం, ఎడమ చేయిపై గాయాలు ఉండడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ నాగరాజ్ వెల్లడించారు. ఆర్ధిక లావాదేవీల నేపథ్యంలో శ్రీనివాస్ను హత్య చేసి ఉంటారనే కోణంలోనూ విచారిస్తున్నామని ఎస్ఐ పేర్కొన్నారు.