కొత్తగూడెం క్రైం, డిసెంబర్ 1: పట్టుదలతో శ్రమిస్తే విజయం ఖాయమని ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో నిర్వహిస్తున్న 250 మంది ఎస్సై, కానిస్టేబుల్ పోలీస్ ఉద్యోగార్థుల శిక్షణా శిబిరాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఈవెంట్స్ మొదలు కానున్నాయని, ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తర్ణులైన వారు మరింత శ్రమించి విజయం సాధించాలన్నారు.
పోలీసు కొలువు సాధించి ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేయవచ్చన్నారు. అనంతరం అభ్యర్థులకు అండగా నిలుస్తూ శిక్షణను పర్యవేక్షిస్తున్న ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, ట్రైనింగ్ ఇన్చార్జ్ నాగేశ్వరరావును అభినందించారు. కార్యక్రమంలో ఆర్ఐలు బి.సోములునాయక్, తుత్తురు దామోదర్ పాల్గొన్నారు.
కొత్తగూడెం క్రైం, డిసెంబర్ 1: జిల్లాలోని ఎస్పీ కార్యాలయంలో గురువారం ఉదయం 11:30 నుంచి 12:30 గంటల వరకు ఎస్పీ వినీత్ గంగన్న నిర్వహించిన ‘డయల్ యువర్ ఎస్పీ’కి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. జిల్లావ్యాప్తంగా 22 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుల్లో ఏడు వ్యక్తిగత తగాదాలు, ఎనిమిది భూతగాదాలు, ఏడు ప్రజాసమస్యలు ఉన్నాయి. ఎస్పీ వాటిని సంబంధిత పోలీస్ అధికారులు, ఎస్హెచ్వోలకు ఎండార్స్ చేసి బాధతులకు న్యాయం చేయాలని ఆదేశించారు.