భద్రాచలం, ఫిబ్రవరి 3: భద్రాచలం సీతారామచంద్ర స్వామివారి దివ్యక్షేత్రంలో శుక్రవారం సహస్ర కలశాభిషేకానికి అంకురార్పణ చేశారు. మాఘమాసంలో రామయ్య తండ్రికి ‘ఏకోత్తర సహస్ర కలశాభిషేకం’ నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా సాయంత్రం 4 గంటలకు పవిత్ర గోదావరి నుంచి తీర్థపు బిందెను తీసుకొచ్చారు. సాయంత్రం 4:30 గంటలకు స్వామివారికి సాయంకాలపు ఆరాధన, 5 గంటలకు యాగశాలలో విశ్వక్సేన ఆరాధన, భగవత్ పుణ్యాహవాచన, పరిషద్రక్షణ, రక్షా బంధన, పుట్టమన్నుతో పూజ, ఆంకరారోపణం, వాస్తు పూజ, ద్వార తోరణ పూజ, అఖండ దీపారాధన, నవ కలశావాహన, అగ్ని ప్రతిష్ఠాపన, అంకురారోపణ హవనం, వాస్తు హోమం జరిపారు. స్వామి వారు ఈ రోజు నుంచి దీక్షలో ఉంటారు కాబట్టి మూడు రోజులపాటు సీతారాములకు ఏకాంత సేవలు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం ఈవో బానోత్ శివాజీ తెలిపారు. అలాగే 4, 5 తేదీల్లో నిత్య కల్యాణాలు కూడా రద్దు చేసినట్లు చెప్పారు. సహస్ర కలశాభిషేక అంకురార్పణలో భాగంగా ముందుగా ఆచార్య బ్రహ్మ రుత్విక్లు సకల మంగళ వాయిద్యాలతో వేద ఘోషలతో, ఆలయ సిబ్బంది, మతపర సిబ్బంది దేవాలయ ప్రదక్షిణ చేసి అంతరాలయంలోని మూలవరుల వద్దకు వెళ్లి స్వామివారి వద్ద భగవత్ ప్రార్థన చేశారు. అనంతరం యాగశాలలో కంకణధారణ, రుత్విక్కరణం, దేవాలయం అధికారులతో దీక్ష కంకణధారణ ఆచార్య బ్రహ్మ రుత్విక్లకు ఇచ్చారు. ఈ సంవత్సరమంతా అమరవాది చెన్న కృష్ణమాచార్యులు (రాజా) ఆచార్యునిగా, అమరవాది మురళీ కృష్ణమాచార్యులు బ్రహ్మగా, రుత్విక్గా వ్యవహరించారు. ఆస్థాన స్థానాచార్యులు కేఈ స్థలశాయి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆలయ ప్రధానార్చకులు అమరవాది విజయరాఘవన్, పొడిచేటి సీతారామానుజాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
దేవస్థానంలో మాఘ మాసోత్సవాల్లో భాగంగా రామచంద్ర మహా ప్రభువుల వారికి సహస్ర కలశములతో ఆవాహన నిర్వహంచనున్నారు. ఉదయం 7 గంటలకు బేడా మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులను ఉంచి ముందుగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచన నిర్వహిస్తారు. వేయి కలశాలను పుణ్య జలాలతో ప్రోక్షంచి, మధ్య రామయ్య తండ్రిని ఆవాహన చేసి, ఆయా కలశాలలో శుద్ధోదకాలు, ద్రవ్యకలశాలు, ఫలోదకాలు, ఇక్షోదకాలు, లవణోదకాలు, కషాయోదకం, సముద్ర జలాలను ఉంచి దిక్కు విదిక్కులలో ఆయా దేవతలను ఆవాహనం చేసి స్వామివారికి సహస్రనామార్చన నిర్వహిస్తారు. అనంతరం లఘు తిరువారాధన, షోడశోపచారాలతో అర్చించి, స్వామివారికి మహా నివేదన చేస్తారు. సాయంత్రం 6 గంటలకు యాగశాలలో ముందుగా అగ్ని ప్రతిష్ఠాపన, పరివార దేవతా హోమం, అగ్ని సంస్కారం, ద్వాదశ పాత్రాశాసాధన, బింబం, కుంభం, మండలం, అగ్ని చతుస్టానార్చన చేయనున్నారు. యాగశాలకు ఉత్తర భాగాన వాస్తు విగ్రహాన్ని పంచ రంగులతో అలంకరించి, వాస్తు పురుషుడిని చిత్రీకరిస్తారు. వాస్తు దోషాలు తొలిగేందుకు చుట్టూ 23 పొంగలి ముద్దలు ఉంచి దీపాలను వెలిగిస్తారు. వసంతాన్ని తయారు చేసి హోమాన్ని ఆచరిస్తారు. చుట్టూ ఉన్న పరదాలను తొలగించి సమస్త మంగళవాయిద్యాలతో వేద ఘోషలతో వాస్తు బలికి 20 శేర్ల అన్నం గోదావరిలో నిమజ్జనం చేస్తారు. అనంతరం సహస్ర కలశాలకు ఆవాహన చేస్తారు.