గత పాలకుల హయాంలో భూ రికార్డులన్నీ అస్తవ్యస్తంగా ఉండేవి. భూ రికార్డులు వీఆర్వోల చేతుల్లో ఉండడంతో పలుకుబడి ఉన్నవారు సులభంగా మార్పులు చేర్పులు చేసుకునేవారు. రైతుకు తెలియకుండానే భూముల హక్కులు మరొకరికి వెళ్లిపోయేవి. రైతులకు అన్యాయం జరగొద్దు అనే ఉద్దేశంతో భూ రికార్డుల డిజిటలీకరణ చేసి కేసీఆర్ సర్కారు ధరణిని తీసుకొచ్చింది. ధరణి పోర్టల్తో వేగంగా, పారదర్శకంగా రికార్డుల నిర్వహణ కొనసాగుతున్నది. నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ జరుగుతున్నది. మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండానే రిజిస్ట్రేషన్లు పూర్తి అవుతున్నాయి. అవినీతి అక్రమాలకు చెక్ పడింది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ధరణి పోర్టల్ను రద్దు చేస్తామంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రకటనలపై రైతులు మండిపడుతున్నారు. పోర్టల్ను నిలిపేస్తే అన్నదాతలు ఇబ్బందులు పడతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– కొణిజర్ల, మే 30
కొణిజర్ల, మే 30: భూముల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో అత్యంత వేగవంతంగా, పారదర్శకంగా రికార్డుల నిర్వహణ కొనసాగుతోంది. మీసేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకున్నదే తరువాయి.. నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియలు పూర్తవుతున్నాయి. మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా, అవినీతి అక్రమాలకు తావు లేకుండా, భూయజమానులకు, కొనుగోలుదారులకు ధరణితో అత్యంత సులువైన సేవలు పారదర్శకంగా అందుతున్నాయి. కాగా, ఇలాంటి ప్రతిష్ఠాత్మకమైన ధరణి పోర్టల్ను రద్దు చేస్తామంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రకటనలపై రైతులు మండిపడుతున్నారు. ‘ధరణి’తోనే ధైర్యంగా ఉన్నామంటూ స్పష్టం చేస్తున్నారు.
గతంలో అలా.. ఇప్పుడు ఇలా..
ధరణి కంటే ముందు భూ రికార్డులన్నీ వీఆర్వోల చేతుల్లో ఉండేవి. దీంతో రాజకీయ పలుకుబడి ఉన్నవారికి, అమ్యామ్యాలు చెల్లించిన వారికి రికార్డుల్లో మార్పులు, చేర్పులు అత్యంత సులువుగా ఉండేవి. రెవెన్యూ అధికారులకు చెయ్యి తడిపితే చాలు పట్టాల్లో మార్పులు, ఒక్క రాతతో భూరికార్డులు మాయమయ్యేవి. వీఆర్వోలు ఏది రాస్తే అదే పట్టాగా చలామణీ అయ్యేది. రోజుల కొద్దీ కార్యాలయాల చుట్టూ తిరిగి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నప్పటికీ మ్యుటేషన్లు కుప్పలుగా తెప్పలు పెండింగ్లో ఉండేవి. పహాణీలో ఒకరకంగా, 1బీ, 13బీలో మరోరకంగా ఉండేవి. చివరికి పట్టా చేతికి రావాలంటే నెలల తరబడి చెప్పులు అరిగేలా తిరిగే దుస్థితి ఉండేది. దీంతో రైతులకు అందాల్సిన వ్యవసాయ రుణాలు, సబ్సిడీ ఎరువులు, విత్తనాల వంటివన్నీ అందని ద్రాక్షలాగా ఉండేవి. ప్రస్తుతం కేసీఆర్ సర్కారు తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో భూరికార్డులన్నీ ఆన్లైన్లో నిక్షిప్తమై ఉంటున్నాయి. పారదర్శకమైన సేవలు అందుతున్నాయి. ఒక క్లిక్తో పట్టాలు, పహాణీలు అందుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా తమ భూముల వివరాలు తెలుసుకునే అవకాశం ఏర్పడింది. అత్యంత పారదర్శకమైన విధానంతో నిమిషాల్లో రిజిస్ట్రేషన్లు, క్షణాల్లో మ్యుటేషన్లు పూర్తవుతున్నాయి. నేరుగా పోస్టల్ ద్వారా ఇంటికే పట్టా వచ్చే పరిస్థితి ఉంది. భూ యజమానికి తెలియకుండా పట్టా మార్పు అసాధ్యమయ్యే కచ్చితత్వం ధరణితోనే ఏర్పడింది.
‘ధరణి’తో 4,120 రిజిస్ట్రేషన్లు..
ధరణి పోర్టల్ వచ్చాక కొణిజర్ల మండలంలో 2020-21, 2021-22 సంవత్సరాలకు నేరుగా కొనుగోలు, అమ్మకాల ద్వారా 2,600 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. భాగాల విభజన (పార్టేషన్) ద్వారా 249 రిజిస్ట్రేషన్లు, భూ యజమాని చనిపోతే వారి వారసురులకు హక్కుల బదిలీ (సక్సేషన్) ద్వారా 513 రిజిస్ట్రేషన్లు, వ్యవసాయ భూములు వ్యవసాయేతర భూములుగా మార్పిడి(నాళా) ద్వారా 164 రిజిస్ట్రేషన్లు, పెండింగ్ మ్యుటేషన్లు 564 కలిపి మొత్తం 4,120 రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తయింది.
‘మిస్సింగ్స్’ పరిష్కారంలో ముందంజ..
గతంలో పాస్పుస్తకాలు ఉండి కొన్ని కారణాల వల్ల ధరణిలో నమోదు కాని రికార్డులను మిస్సింగ్స్ సర్వే నెంబర్లుగా పరిగణిస్తారు. వీటిలో ఖమ్మం జిల్లాలోని మొత్తం 21 మండలాల్లో అత్యధికంగా 955 ఫైళ్లను కొణిజర్ల రెవెన్యూ అధికారులు ప్రతిపాదించగా ఇప్పటి వరకు 246 పరిష్కారమయ్యాయి. మరో 155 తిరస్కరణకు గురయ్యారు. ఇంకో 554 పరిశీలనలో ఉన్నాయి. మిస్సింగ్స్ పరిష్కారంలో కొణిజర్ల తర్వాత తల్లాడ, కూసుమంచి మండలాలు ఉన్నాయి. అయితే మిస్సింగ్ సర్వేనెంబర్ల పరిష్కారంలో రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా ముందు వరుసలో ఉంది.
సామాన్యులకు ఎంతో సులభం..
‘ధరణి’ సేవలు సామాన్యులకు ఎంతో సులభమయ్యాయి. చిన్నచిన్న రైతులు మొదలుకొని పెద్ద రైతుల వరకు మీసేవా కేంద్రాల ద్వారా స్లాట్ బుక్ చేసుకొని ఇద్దరు సాక్షుల సహకారంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు హాజరవుతున్నారు. నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియను ముగిస్తున్నాం. కలెక్టర్ అర్ధరాత్రి తర్వాత కూడా ప్రతి ఫైల్స్ క్షుణ్ణంగా పరిశీలించి నిజమైన భూ యజమానికి లబ్ధి చేకూరేలా చొరవ చూపుతున్నారు. ధరణి నిర్వహణ నిజమైన యజమానులకు ఎంతో ఉపయుక్తకరంగా ఉంది.
-డీ.సైదులు, తహసీల్దార్, కొణిజర్ల
‘ధరణి’ లేకుంటే మళ్లీ పాత రోజులే..
నేను మా గ్రామానికి చెందిన మా సమీప బంధువు వద్ద 28 కుంటల భూమిని కొనుగోలు చేశాను. స్లాట్ బుకింగ్ రోజు ఆన్లైన్లో చెల్లించిన చలానా మినహాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు. అధికారులు నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసి సంబంధిత పత్రాలు నా చేతికి అందించారు. ధరణి పోర్టల్ ద్వారానే ఇది సాధ్యమైంది. ఈ పోర్టల్ లేకుంటే పాత రోజులు మళ్లీ వస్తాయి. మాలాంటి రైతులకు పారదర్శకమైన సేవలందిస్తున్న ధరణి పోర్టల్ను తాము అధికారంలోకి వచ్చాక రద్దు చేస్తామంటూ ప్రతిపక్షాలు చెబుతుండడం గర్హనీయం. అలా జరిగితే రైతులకు ఇబ్బందులు తప్పవు.
-బోగిన్ని వెంకటేశ్, బస్వాపురం
రైతులను ఇబ్బందులపాలు చేయాలన్నదే ప్రతిపక్షాల కుట్ర..
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులను ఇబ్బందులపాలు చేయాలన్నదే ప్రతిపక్షాల కుట్ర. అందుకే తాము అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్ను రద్దు చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ధరణి ద్వారా అన్నదాతలకు పారదర్శకమైన సేవలు అందించడాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇందులో భాగంగానే మాయమాటలు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి. గత ప్రభుత్వాల పాలనలో రిజిస్ట్రేషన్ అంటే ప్రాణం మీదకు వచ్చేది. మధ్యవర్తులకు ముట్టజెప్పడాలు, నెలల తరబడి నిరీక్షించడాల వంటి బాధలెనో ఉండేవి. ఇప్పుడు ధరణి వచ్చాక నిమిషాల్లోనే పనులు పూర్తవుతున్నాయి.
-నున్నా వెంకటేశ్వర్లు, పల్లిపాడు, కొణిజర్ల మండలం