కొత్తగూడెం క్రైం, జనవరి 19: రాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని, వారి కార్యకలాపాలను నిర్మూలించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా పోలీస్ అధికారులను తెలంగాణ మల్టీ జోన్-1 ఐజీ చంద్ర శేఖర్ రెడ్డి ఆదేశించారు. కొత్తగూడెం ఎస్పీ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జిల్లాలోని పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా ఆయనకు ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.
సాయుధ దళాలు గౌరవ వందనం సమర్పించాయి. సమావేశంలో ఐజీ మాట్లాడుతూ.. మావోయిస్టుల కదలికపై ఎప్పటికప్పుడు పటిష్టమైన నిఘా ఉండాలన్నారు. ఏజెన్సీ ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. మావోయిస్టులు సరిహద్దులు దాటి తెలంగాణాలోకి అడుగు పెట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా వ్యవహరించాలన్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలని ఆదేశించారు. నిర్మాణం పూర్తయిన పోలీస్ స్టేషన్ భవనాలను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు.
సమావేశం అనంతరం, నూతన కలెక్టరేట్ సమీపంలో జిల్లా పోలీస్ కార్యాలయం (డీపీవో) నిర్మాణ పనులను పరిశీలించారు. అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) టి.సాయిమనోహర్, భద్రాచలం ఏఎస్పీ బిరుదరాజు రోహిత్రాజ్, ఏఎస్పీ అక్షాంశ్ యాదవ్, కొత్తగూడెం డీఎస్పీ గుడ్ల వెంకటేశ్వర్ బాబు, ఇల్లెందు డీఎస్పీ రమణమూర్తి, మణుగూరు డీఎస్పీ రాఘవేంద్రరావు, పాల్వంచ డీఎస్పీ తాళ్లపెల్లి సత్యనారాయణ, డీసీఆర్బీ డీఎస్పీ బానోత్ నందీరామ్, ఏఆర్ డీఎస్పీ విజయ్ బాబు, అన్ని పోలీస్ స్టేషన్లు, సర్కిళ్లు, వివిధ విభాగాల ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.