తెలంగాణ సర్కార్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నదని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. కొత్తగూడెంలోని ప్రగతి మైదాన్లో ఆదివారం నిర్వహించిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో కలెక్టర్ అనుదీప్, ఎస్పీ సునీల్దత్తో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లాలో చేపడుతున్న ప్రాజెక్టులను పూర్తి చేసి సాగుభూములను సస్యశ్యామలం చేస్తామన్నారు. భూ సమస్యల పరిష్కారానికి సర్కార్ ‘ధరణి’ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. రైతుబంధు, రుణమాఫీతో రైతులకు మేలు జరుగుతున్నదన్నారు. అన్ని వర్గాల శ్రేయస్సు కోసం ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు.
కొత్తగూడెం, ఆగస్టు 15: అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముందువరుసలో ఉందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. 75వ స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రమైన కొత్తగూడెం ప్రగతి మైదానంలో ఆయన త్రివర్ణ పతాకావిష్కరణ చేశారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా వేదికలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్ర సంగ్రామంలో మహనీయుల త్యాగం చిరస్మరణీయమని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక అభివృద్ధి మరింత వేగతవంతమైందని, భద్రాద్రి జిల్లాలో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని అన్నారు. అందుకోసమే సీతారామ, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులను చేపట్టిందని, వీటి నిర్మాణం పూర్తయితే జిల్లా సస్యశ్యామలం అవుతుందని అన్నారు. రైతుబంధు పథకం కింద జిల్లాలో 1,33,523 మంది రైతులకు రూ.204 కోట్ల పంటల పెట్టుబడికి సాయం అందించినట్లు చెప్పారు. ఆయిల్పాం, కోకో పంటల సాగులో జిల్లా ప్రథమస్థానంలో ఉందన్నారు. 12,574 మంది కొత్త రేషన్కార్డు దారులకు ఈ నెల నుంచి బియ్యం అందిస్తున్నామన్నారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పథకాల గురించి, ప్రజల సంక్షేమం కోసం వివిధ పథకాల ద్వారా ప్రజలకు చేకూర్చిన లబ్ధి గురించి వివరించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. భద్రాద్రి కలెక్టర్ అనుదీప్, ఎస్పీ సునీల్దత్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్డీవో మధుసూదన్రావు, జిల్లా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.