కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముందువరసలో నిలుస్తున్నది. ముఖ్యంగా స్వచ్ఛతలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. స్వచ్ఛ సర్వేక్షణ్-2022లో దేశంలోనే మూడో ర్యాంకు సాధించింది. కేంద్ర ప్రభుత్వ మిషన్ డైరెక్టర్, స్వచ్ఛ భారత్ జల్జీవన్ మిషన్ అదనపు కార్యదర్శి వికాస్ సీల్ అధికారికంగా గురువారం ర్యాంకులను ప్రకటించారు. పారిశుధ్య నిర్వహణ, స్వచ్ఛతపై గత జనవరి 6 నుంచి 9వ తేదీ వరకు, ఏప్రిల్ 21వ తదీన కేంద్ర పరిశీలన బృందాలు జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేసిన విషయం విదితమే. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో మన జిల్లాకు మూడో ర్యాంకు దక్కడం విశేషం. ఓడీఎఫ్లోనూ జిల్లా నంబర్వన్ స్థానంలో ఉంది. కలెక్టర్ చూపిన ప్రత్యేక చొరవ, అధికారుల విశేష కృషి, సర్పంచుల చిత్తశుద్ధి కారణంగానే జిల్లా అగ్రగామిలో నిలబడింది.
– భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ)
జిల్లాలో 22 గ్రామాల్లో సర్వే
దేశవ్యాప్తంగా జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో భద్రాద్రి జిల్లాలో 22 గ్రామాల్లో సర్వే బృందం పర్యటించింది. ఇందులో స్వచ్ఛతలో భాగస్వామ్యమైన ప్రజల పరిస్థితులను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. వారు ఎంచుకున్న గ్రామాల్లో పర్యటించిన సర్వే బృందం గ్రామస్థాయిలో పారిశుధ్యం నిర్వహణ, అంగన్వాడీ స్కూల్స్లో పిల్లలకు కల్పించిన మౌలిక సదుపాయాలు, పంచాయతీల్లో తడి, పొడి చెత్తను వేరు చేస్తున్న వైనం, ఇంటింటికీ మరుగుదొడ్డి ఉందా లేదా? ఉంటే వాడుతున్నారా లేదా? సోక్ పిట్ నిర్మించుకున్నారా, వ్యర్థాలను ఎక్కడ వేస్తున్నారు అనే అంశాలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రతలో న్యాప్కిన్ ప్యాడ్లు ఏ విధంగా డిస్పోజ్ చేస్తున్నారు. వాటిపై పంచాయతీ చెత్త ట్రాక్టర్లో కార్మికులు ఎక్కడ డిస్పోజ్ చేస్తున్నారు అనే అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఇంటి ఆవరణలో ఇంకుడుగుంత నిర్మాణం చేసుకున్నారా లేదో కూడా తెలుసుకున్నారు. రహదారుల పక్కన పిచ్చిమొక్కలు లేకుండా అవెన్యూ ప్లాంటేషన్ నిర్వహణ ఎలా ఉందో సర్వే టీం సభ్యులు తెలుసుకున్నారు. మరుగుదొడ్డి వాడకంపై వాల్ పెయింటింగ్ ఉందా.. ప్రచారం చేస్తున్నారా లేదా అనే అంశాలను తీసుకున్నారు. 1000కి మూడు వందల మార్కులను ఈ అంశాలపైనే తీసుకున్నారు. వీటన్నింటిలో మనం టాప్లో ఉండడంతో జిల్లాకు ర్యాంకు సాధ్యమైంది.
అధికారుల ప్రత్యేక కృషి
స్వచ్ఛ సర్వేక్షణ్లో జిల్లా మూడో ర్యాంకు సాధించి దేశంలోనే ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నది. మున్సిపాలిటీలు, పంచాయతీలను పరిశుభ్రంగా ఉంచడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విశేషంగా కృషి చేస్తున్నారు. ప్రతి పంచాయతీలో ట్రాక్టర్, ట్యాంకర్, పల్లె ప్రకృతి వనాలు, అవెన్యూ ప్లాంటేషన్ల నిర్వహణ అద్భుతంగా ఉంది. పారిశుధ్యం మెరుగు కోసం కలెక్టర్ అనుదీప్ తీసుకున్న ప్రత్యేక చర్యల ఫలితంగా ఉత్తమ పంచాయతీలుగా గుర్తింపు తెచ్చుకుని స్వచ్ఛ భద్రాద్రిగా జిల్లా అగ్రగామిలో నిలిచింది. ప్రతి పంచాయతీలో చెత్తను తొలగించేందుకు ట్రాక్టర్లను కొనుగోలు చేసుకుని క్లీన్ పంచాయతీలుగా తీర్చిదిద్దుతున్నారు. డంపింగ్యార్డులను నిర్మించుకొని చెత్తను రహదారులపై లేకుండా చేయగలిగారు. కేవలం చెత్తను ఏరివేయడమే కాకుండా చెత్తతో కంపోస్టు ఎరువును తయారు చేసి పంచాయతీలకు అదనపు ఆదాయాన్ని సమకూరుస్తున్నారు. చెత్తను తొలగించడంలో పంచాయతీ కార్యదర్శులు, కార్మికులు కీలకపాత్ర పోషించారు. తెల్లవారేసరికి విజిల్ వేసుకుని ఇంటింటికీ తిరిగే చెత్త ట్రాక్టర్ స్వచ్ఛ ర్యాంకు రావడానికి కీలక భూమిక పోషించింది. సర్పంచ్లు కూడా పర్యవేక్షణలో భాగస్వాములవుతున్నారు. మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించడంతోపాటు నిత్య పర్యవేక్షణ చేస్తూ వారి పనితీరు మెరుగుపరిచేందుకు కలెక్టర్ అనుదీప్ చూపిన చొరవ విశేషంగా చెప్పుకోవచ్చు.
ఓడీఎఫ్లోనూ మనమే టాప్
దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 117 ఆస్పిరేషన్ జిల్లాల్లో మన జిల్లాకు గుర్తింపు లభించింది. ఇవన్నీ గిరిజన, ఎస్సీ జనాభా అధికంగా ఉన్న, కొండప్రాంత, వెనుకబడిన జిల్లాలే. వీటిలో రోడ్లు, విద్యుత్తు, డ్రైనేజీ వ్యవస్థలు, ఇంటింటికీ ఉన్న నల్లా నీటి వసతి, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇతర అన్ని మౌలిక సౌకర్యాలను కల్పించిన గ్రామాలనే ఉత్తమ గ్రామాలుగా గుర్తించారు. మొత్తం 60అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. 117 జిల్లాలోని 1,09,291 గ్రామాల్లో ఓడీఎఫ్ ప్లస్ గుర్తింపు పొందినవి 4,190 గ్రామాలే. వీటిలో 1,386 గ్రామాలు రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 646 గ్రామాల్లో ఏకంగా 98.48 శాతం గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ గుర్తింపును పొందాయి.
వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2019లోనే ఓడీఎఫ్ గుర్తింపు పొందింది. స్వచ్ఛ భారత్లో భాగంగా జిల్లాలో 89,506 వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకున్నారు. 32,791 వ్యక్తిగత, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో మరో 1,331 ఇంకుడు గుంతలు నిర్మించారు. కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, పాల్వంచ ప్రాంతాల్లో డ్రై రీసోర్స్ కలెక్షన్ సెంటర్(డీఆర్సీసీ)లను ఏర్పాటు చేశారు. వీటితోపాటు 4 ఫికల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎఫ్ఎస్టీపీ)లను ఏర్పాటు చేశారు. సెప్టిక్ ట్యాంకుల నుంచి సేకరించే వ్యర్థాల ప్రాసెసింగ్కు వీటిని ఉపయోగిస్తారు. తద్వారా జిల్లాకు నూటికి నూరుశాతం ఓడీఎఫ్ ప్లస్ గుర్తింపు లభించింది.