బూర్గంపహాడ్, ఆగస్టు 26 : సర్వర్ మొరాయించడంతో రేషన్ బియ్యం పంపిణీ నిలిచిపోయి లబ్దిదారులు ఇబ్బందులు పడ్డారు. బుధవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని ఇరవెండి గ్రామ పంచాయతీలోని రేషన్ దుకాణం వద్ద లబ్దిదారులు రేషన్ బియ్యం కోసం వెళితే వేలిముద్రలు తీసుకునే యంత్రం మొరాయించింది. దీంతో గంటల కొద్దీ లబ్దిదారులు రేషన్ బియ్యం కోసం వచ్చి పడిగాపులు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ గుండి బాబూరావు, మహంకాళి రామారావు దుకాణం వద్దకు వెళ్లి లబ్దిదారుల ఇబ్బందులను గమనించి డిప్యూటీ తాసీల్దార్కు సమాచారం ఇచ్చి ఆయనను అక్కడకు పిలిపించి పరిస్థితిని వివరించారు. ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇస్తుండగా సర్వర్ పనిచేయకపోవడం, ఈ నెల 30వ తేదీ వరకే గడువు ఉండడంతో రేషన్ అందని లబ్దిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి అర్హుడికి బియ్యం అందేవరకు రేషన్ పంపిణీని ఆపవద్దని సర్పంచ్, ఉపసర్పంచ్ అధికారులను కోరారు.