కొత్తగూడెం : ఇటీవల గోవాలో జరిగిన జాతీయ యూత్ గేమ్స్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో కొత్తగూడెం జిల్లాకు బంగారు పతకాలు లభించాయి. జాతీయ స్థాయిలో బంగారు పతకం గెలుపొందిన వినయ్ను శుక్రవారం కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మీ, కమిషనర్ అరిగెల సంపత్కుమార్, అసోసియేషన్ చైర్మన్ కాపు కృష్ణలు ప్రత్యేకంగా అభినందించారు. శాలువ కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ సీతాలక్ష్మీ మాట్లాడుతూ… యువతీ యువకులు చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి కనపర్చాలని, క్రీడల్లో శిక్షణ పొందడం ద్వారా ఎంతో క్రమశిక్షణ అలవడుతుందని, దీనివల్ల చదువుతో పాటు క్రీడల్లో కూడా బాగా రాణించి ఉన్నత స్థాయికి ఎదుగుతారని అన్నారు.
అసోసియేషన్ చైర్మన్ కాపు కృష్ణ మాట్లాడుతూ… మన జిల్లాకు చెందిన క్రీడాకారులు వినయ్ చదువులో కూడా ప్రతిభ కనపరుస్తూ రెజ్లింగ్లో జాతీయ స్థాయిలో బంగారు పతకం గెలుపొందడం జిల్లాకే గర్వకారణమని అన్నారు. మరింత శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీల్లో కూడా మరిన్ని పతకాలు గెలుపొంది మన రాష్ట్రానికి, దేశానికి పేరు తేవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.కాశీహుస్సేన్, జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ చైర్మన్ కూచన కృష్ణారావు, జిల్లా తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఇనిగాల మొగిలి పాల్గొన్నారు.