– 14 రోజులుగా దీక్షలు చేస్తున్నా కనీస స్పందన కరువు
బూర్గంపహాడ్, ఏప్రిల్ 08 : రెండు వారాలుగా కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం రిలే దీక్షలు చేపట్టినా ఐటీసీ యాజమాన్యం ఆ సమస్యలను గాలికి వదిలేసిందని, చర్చలకు కూడా పిలవకుండా తాత్సారం చేస్తుందని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, బల్లెం నాగయ్య, ఎండీ యాకూబ్పాషా అన్నారు. బుధవారం రిలే నిరాహార దీక్షలు 14వ రోజుకు చేరుకోవడంతో ఈ దీక్షల్లో తోకల నరేశ్, ప్లాంటేషన్ మహిళా కార్మికులు బోళ్ల సమ్మక్క, దార్ల కవిత, పట్రా సుమిత్ర, గంధం సిరి పాల్గొని మద్దతు పలికారు.
ఈ సందర్భంగా జేఏసీ బాధ్యులు మాట్లాడుతూ.. నిరసనలు 14 రోజులు పూర్తయినా ఐటీసీ యాజమాన్యం నుండి ఎలాంటి పిలుపులేదని, కార్మికుల సహనాన్ని పరీక్షిస్తే మున్ముందు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ఇప్పటికైనా ఐటీసీ యాజమాన్యం దిగి వచ్చి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేదంటే సమ్మెబాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ రిలే దీక్షల్లో జేఏసీ సభ్యులు ఆకిని సర్వేశ్వరరావు, కందాల వెంకటరెడ్డి, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, మర్రి వెంకటరెడ్డి, చుక్కపల్లి బాలాజీ, సూరిశెట్టి జగదీష్, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.