బూర్గంపహాడ్, ఏప్రిల్ 22 : అపరిష్కృతంగా ఉన్న కార్మిక సమస్యలను పరిష్కరించడంతో పాటు వేతన ఒప్పందంలో పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు కాంట్రాక్టు కార్మిక జేఏసీ నాయకులతో ఐటీసీ యాజమాన్యం తక్షణం చర్చలు జరపాలని కాంట్రాక్టు కార్మిక సంఘం జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, ఎండీ.యాకూబ్పాషా, బల్లెం నాగయ్య డిమాండ్ చేశారు. 28 రోజులుగా ఎండను సైతం లెక్కచేయడకుండా కార్మికులు రిలే నిరాహార దీక్షల్లో పాల్గొంటున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 28వ రోజు దీక్షలో ఉప్పులూరి సోమరాజు, బండారు రామకృష్ణ, బత్తుల గోపాలరావులు దీక్షలో కూర్చోగా వారికి కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు ఆకిని సర్వేశ్వరరావు, యాకూబ్ పాషా పూలమాల వేసి దీక్ష ప్రారంభించారు.
కార్మికుల సమస్యలను పరిష్కరించని యాజమాన్యంపై జేఏసీ తీవ్రంగా వత్తిడి తెచ్చేలా పోరాడుతుందని, సమస్యలు పరిష్కరించకపోతే మున్ముందు యాజమాన్యంతో ఎంతటి ఆందోళనకైనా సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే సమ్మెకు సైతం దిగుతామని హెచ్చరించారు. తక్షణమే ఐటీసీ యాజమాన్యం తన వైఖరి మార్చుకుని జేఏసీతో చర్చలకు రావాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షా శిబిరంలో జేఏసీ సభ్యులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.