– కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ హెచ్చరిక
బూర్గంపహాడ్, ఏప్రిల్ 24 : కార్మిక సమస్యలపై ఐటీసీ యాజమాన్యం స్పందించకుంటే నిశ్శబ్ధంగా 30 రోజులు సాగిన రిలేదీక్ష గర్జనగా మారుతుందని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, ఎండీ యాకూబ్పాషా, బల్లెం నాగయ్య హెచ్చరించారు. ఎండను సైతం లెక్కచేయకుండా కార్మికులు తమ సమస్యలను దీక్షల రూపంలో యాజమాన్యానికి తెలియచేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ కార్మికుల పోరాటాన్ని పట్టించుకోవడం లేదని, ఇప్పటికే సమ్మెకు వెళ్లేందుకు కాంట్రాక్టు కార్మికులు సిద్ధంగా ఉన్నారని, రాబోయే రోజుల్లో నిశ్శబ్ధ పోరాటం మరింత ఉధృతం కానుందని హెచ్చరించారు.
30వ రోజు దీక్షలో షేక్ అలీ, బాదం సంతోష్రెడ్డి, మోదుగు నవేంద్రప్రసాద్, గంట్ల శ్రీనివాసరావు, పూసం ముంతాజ్లు పాల్గొనగా కార్మిక జేఏసీ నాయకులతో పాటు చుక్కపల్లి బాలాజీ, మేకల శేషమ్మ, సూరిశెట్టి జగదీశ్ పూలమాల వేసి దీక్షలను ప్రారంభించారు. కార్మికుల సమస్యలపై ఇకనైనా ఐటీసీ యాజమాన్యం స్పందించి పరిష్కరించకుంటే సమ్మె బాట పట్టడమే కాకుండా పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తక్షణమే ఐటీసీ యాజమాన్యం తన వైఖరి మార్చుకుని జేఏసీతో చర్చలకు రావాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షా శిబిరంలో జేఏసీ సభ్యులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.