రుద్రంపూర్, ఏప్రిల్ 30 : ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని వెంకటేష్ ఖని కోల్ మైన్ ప్రాజెక్టు ఆఫీసర్ నరసింహరావు తెలిపారు. గురువారం సింగరేణి కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో (VKCM ) వెంకటేష్ ఖని కోల్ మైన్ ప్రాజెక్టు ప్రభావిత పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా గౌతంపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో వైద్య నిపుణులు గ్రామ ప్రజలకు రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్) వంటి వ్యాధులపై పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. శిబిరానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్య సంక్షేమం కోసం సింగరేణి సంస్థ ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తుందని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా హెల్త్ ఆఫీసర్ లలిత కుమారి మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపించి ఇలాంటి వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ లలిత కుమారి, వీకేసీఎం ప్రాజెక్టు ఆఫీసర్ నరసింహరావు, గౌతంపూర్ గ్రామ సర్పంచ్ సపవాట్ కళ్యాణి, గ్రామ కార్యదర్శి శర్మిల, వెల్ఫేర్ ఆఫీసర్ విక్టర్, ఏఐటీయూసీ నాయకులు ఎం.ఆర్.కే ప్రసాద్, ఐఎన్టీయూసీ నాయకుడు గోపుకుమార్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.