– మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా
రుద్రంపూర్, జూన్ 15 : రాష్ట్రంలోని మైనార్టీ గురుకులాల పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న బాలికలకు చెల్లించాల్సిన కాస్మోటిక్ చార్జీలు ఏడాది గడిచినా ఇప్పటికీ వారి ఖాతాల్లో జమ కాకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా సోమవారం ఓ ప్రకటనలో విమర్శించారు. 2024-25 విద్యా సంవత్సరంలో మైనార్టీ బాలికలకు కాస్మోటిక్ కిట్లు పంపిణీ చేసిన ప్రభుత్వం, 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి కాస్మోటిక్ కిట్ల స్థానంలో నగదు మొత్తాన్ని నేరుగా బాలికల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించిందన్నారు. ఈ మేరకు ఆరు నెలల క్రితమే బాలికలందరికీ బ్యాంకు ఖాతాలు తెరిపించి, వాటి వివరాలను ప్రభుత్వానికి పంపించినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కాస్మోటిక్ కిట్లలో షాంపూ, తలనూనె, టూత్ బ్రష్, దువ్వెన, రెండు రకాల రిబ్బన్లు, బట్టలు ఉతికే సబ్బులు, స్నాన సబ్బులు తదితర వస్తువులు ఉండేవని, వాటి కొనుగోలుకు అవసరమైన మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ విద్యా సంవత్సరం పూర్తయి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనా చెల్లింపులు జరగకపోవడం విచారకరమని పేర్కొన్నారు. మైనార్టీ బాలికల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పెండింగ్లో ఉన్న కాస్మోటిక్ చార్జీలను వెంటనే బాలికల బ్యాంకు ఖాతాల్లో జమ చేసి వారికి న్యాయం చేయాలని ఎండి యాకూబ్ పాషా డిమాండ్ చేశారు.