కొత్తగూడెం మే 2:కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బాధితులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.. కష్టకాలంలో వైద్యపరంగా సలహాలు అందించేందుకు టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయాలని వైద్యారోగ్యశాఖను ఆదేశించింది. ఈమేరకు కొత్తగూడెం అధికారులు జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో 08744-241950, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కార్యాలయంలో 08744 -245566 నెంబర్లను అందుబాటులో ఉంచారు. గడిచిన నాలుగు రోజుల్లో 23 మంది ఈ నెంబర్లను సంప్రదించి సహకారం పొందారు. వీరిలో హోం ఐసొలేషన్లో ఉన్న కొవిడ్ బాధితులు ఎక్కువమంది ఉన్నారు.
సేవలు ఇలా..
కలెక్టరేట్లోని కాల్ సెంటర్కు ఆదివారం ఓ మహిళ కాల్ చేసింది. తనకు కొవిడ్ లక్షణాలు ఉన్నాయని, టెస్ట్ చేయించుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పింది. సోమవారం కొత్తగూడెంలోని టెస్ట్ సెంటర్కు వచ్చి టెస్టు చేయించుకోవచ్చని అధికారి ఆమెకు సలహా ఇచ్చారు. ఇదే నెంబర్కు భద్రాచలం నుంచి మరో కాల్ వచ్చింది. ఓ కొవిడ్ బాధితుడు మెడిసిన్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని, పరిష్కారం చూపాలని కోరాడు. వెంటనే స్పందించిన కాల్ సెంటర్ అధికారి భద్రాచలంలోని ఆశ వర్కర్కు సమాచారం ఇచ్చారు. ఆమె బాధితుడికి అవసరమైన మెడిసిన్ను చేరవేసింది. ఇలా కొవిడ్పై ఎలాంటి సందేహాలు ఉన్నా ఈ నెంబర్లను సంప్రదించవచ్చు.
అనాథ పిల్లల కోసం ప్రత్యేక నెంబర్లు..
కొవిడ్ బారిన పడి కొందరు తల్లిదండ్రులు మృతిచెందగా వారి పిల్లలు అనాథలుగా మిగులుతున్న సంగతి తెలిసిందే. అలాంటి వారిని చేరదీసి కొవిడ్ సెంటర్కు తరలించి వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నది. 1098 లేదా 040-23733665 కి కాల్ చేసి పిల్లల వివరాలు అందించవచ్చని ఇటీవల భద్రాద్రి కలెక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. పైన పేర్కొన్న టోల్ ఫ్రీ నెంబర్లన్నీ 24 గంటలూ అందుబాటులో ఉంటాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల బెడ్స్, వైద్య సేవలపై అధికారులు సమాచారం ఇస్తారన్నారు.