భద్రాద్రి కొత్తగూడెం (నమస్తే తెలంగాణ)/ చుంచుపల్లి, ఏప్రిల్ 17 : పల్లె పంచాయతీకి అరుదైన గుర్తింపు లభించింది. ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకుంది. ఆరోగ్య పంచాయతీ విభాగంలో ఎంపికైన చుంచుపల్లి మండలం గౌతంపూర్ జీపీకి ఉత్తమ పంచాయతీగా జాతీయ స్థాయిలో పురస్కారం లభించింది. ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో సోమవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సర్పంచ్ పొడియం సుజాత అవార్డు అందుకోగా.. కలెక్టర్ అనుదీప్, డీపీఓ రమాకాంత్, కార్యదర్శి షర్మిల పాల్గొన్నారు. ఇలాంటి అరుదైన గౌరవం భద్రాద్రి జిల్లాకు దక్కడం ఇది రెండోసారి. యువ కలెక్టర్ అనుదీప్ సారథ్యంలో గతంలో స్వచ్ఛ గ్రామీణ్కు జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకు రావడంతో ఢిల్లీలోనే కలెక్టర్కు పురస్కారం లభించింది. తెలంగాణలో సంక్షేమ పథకాల అమలు, జరుగుతున్న అభివృద్ధి దేశానికి గీటురాయిగా నిలవడం ఇదొక ఉదాహరణగా చెప్పవచ్చు.
తెలంగాణ పల్లెకు అరుదైన గుర్తింపు
రాష్ట్ర ఏర్పాటు తర్వాత అమలవుతున్న మన పథకాలు దేశానికి దిక్సూచిలా నిలుస్తున్నాయి. నాడు స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛత అవార్డును సొంతం చేసుకున్న భద్రాద్రి జిల్లా.. నేడు ఉత్తమ పంచాయతీలో ఆరోగ్య పంచాయతీ విభాగంలో జిల్లా, రాష్ట్ర స్థాయి గుర్తింపు తెచ్చుకొని నేడు జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికై ప్రశంసలు అందుకుంది. ఆరోగ్య విభాగంలో జాతీయ స్థాయిలో మొదటి బహుమతిని సాధించింది. జాతీయ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఉత్తమ పంచాయతీగా ప్రకటించిన విషయం విదితమే. దీంతో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ సారథ్యంలో అవార్డు ఎంపికల్లో తన సత్తా చాటుకున్నైట్లెంది.
పంచాయతీకే వన్నెతెచ్చిన గౌతంపూర్
పంచాయతీ రాజ్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి తెలంగాణ సర్కారు గ్రామపంచాయతీల అభివృద్ధిలో సత్తాచాటుకుంటుంది. దీంతో రాష్ట్రస్థాయిలో చుంచుపల్లి మండలం గౌతంపూర్ పంచాయతీ ఉత్తమ పంచాయతీ అవార్డును సొంతం చేసుకుని దేశస్థాయిలో మొదటి బహుమతిని దక్కించుకుంది. నాడు అభివృద్ధికి దూరంగా ఉన్న పంచాయతీ వ్యవస్థకు సీఎం కేసీఆర్ సరికొత్త రూపం తీసుకువచ్చారు. దీంతో పల్లెలు అభివృద్ధిలో నువ్వా.. నేనా అని పోటీపడుతున్నాయి. పల్లె పకృతి వనాలు, హరితహారం, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, నర్సరీల పెంపకం, ఇంటింటికీ మరుగుదొడ్డి, ఇంకుడు గుంతల నిర్వహణ తదితర అంశాలతో గ్రామాలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. ప్రతీ పంచాయతీకి ట్యాంకర్,ట్రాక్టర్తోపాటు కొత్త పంచాయతీ భవనం సమకూరడంతో అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయి. భద్రాద్రి జిల్లాలో ఇటీవల నిర్వహించిన సర్వేలో మండల, జిల్లా, రాష్ట్రస్థాయి అవార్డులను గెలుచుకున్నారు. జిల్లాస్థాయిలోనూ గౌతంపూర్ జీపీకి ఉత్తమ పురస్కారం రాగా, రాష్ట్రస్థాయిలో ఆరోగ్య పంచాయతీ విభాగంలో అరుదైన గౌరవం దక్కింది. ఈ పంచాయతీ సర్పంచ్ పొడియం సుజాత, కార్యదర్శి షర్మిల మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఇటీవల అవార్డు కూడా అందుకున్నారు.
ఆరోగ్య జీపీగా జాతీయస్థాయి పురస్కారం
గౌతంపూర్ జీపీ ఆరోగ్య విభాగంలో తన సత్తా చాటుకుంది. పూర్తిస్థాయి ఓడీఎఫ్గా ఉన్న జీపీలో 1,168 ఇళ్లు ఉండగా.. ప్రతీ ఇంటికి మరుగుదొడ్డితోపాటు ఇంకుడు గుంతను నిర్మించుకున్నారు. పక్కా సింగరేణి కార్మిక ప్రాంతం కావడం.. సంస్థ నిధులు కూడా ఈ జీపీకి తోడవడంతో అభివృద్ధిలో పరుగులు పెట్టింది. 4,407 జనాభా కలిగిన ఈ గ్రామంలో ఏడాదిలో 37 మంది ప్రసవాలు జరిగాయి. ఇందులో శిశు మరణాలు లేని గ్రామంగా గుర్తింపు పొందింది. దీంతోపాటు మలేరియా, డెంగీ, బలహీనత సమస్యలు కూడా లేకుండా ఉండటంతో ఈ జీపీని ఆరోగ్య పంచాయతీగా గుర్తించారు.
పల్లె పకృతితో మారిన రూపురేఖలు
అక్కడ అభివృద్ధి జరిగిందంటే అది కేవలం పల్లె ప్రగతితోనే సాధ్యమైందని చెప్పవచ్చు. గౌతంపూర్ పంచాయతీలో ఉన్న 1,168 ఇళ్లలో ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టి వంద శాతం ఓడీఎఫ్గా తీర్చిదిద్దారు. 4,400 జనాభా ఉన్న కార్మిక ప్రాంతంలో రహదారులపై చెత్త కనిపించకుండా పంచాయతీ కార్మికులు, సిబ్బంది చేసిన తీరు అభినందనీయంగా చెబుతున్నారు. పల్లె పకృతి వనంలో నాటిన 4,500 మొక్కలు గ్రామానికే కొత్త శోభను తెచ్చాయి. దీంతోపాటు కోటివనం పార్క్లో కూడా మరో 2వేల మొక్కలు నాటి పంచాయతీలో పచ్చదనాన్ని పరిచారు. గ్రామంలోని రహదారుల పక్కనే ఉన్న ప్రాంతంలో 800 మొక్కలను నాటడంతో అవి రహదారికి కొత్త అందాన్ని తెచ్చిపెట్టాయి. ఇప్పుడు గ్రామపంచాయతీ రూపురేఖలే మారిపోయాయి.