భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న ఆరు గ్యారెంటీ పథకాలకు ప్రజలు దరఖాస్తు చేసుకునే విషయంలో వ్యక్తమవుతున్న సందేహాలను నివృత్తి చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. దరఖాస్తులోని అంశాలపై సదరు సిబ్బందికి కూడా అవగాహన లేకపోవడంతో దరఖాస్తులను స్వీకరిస్తూ రశీదు ఇచ్చి పంపేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా శుక్రవారం రెండో రోజు ప్రజా పాలన గ్రామసభలకు ఉదయం నుంచి ఎవరూ రాకపోవడంతో సభలు వెలవెలబోయాయి. 10 గంటల తర్వాత ప్రజలు దరఖాస్తులు సమర్పించడానికి గ్రామసభలకు వస్తున్నారు. కొన్ని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో సిబ్బంది ఇళ్లకు వెళ్లి దరఖాస్తు ఫారాలు ఇవ్వగా.. మరికొందరు ప్రజలు గ్రామసభ వద్దే దరఖాస్తు ఫారాలు తీసుకుంటున్నారు. అయితే ఒకే ఇంట్లో అందరం కలిసి ఉంటున్నాం.. మాకు ఇల్లు లేదు.. ఏ ఇంటి నెంబర్ దరఖాస్తులో వేయాలనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కాగా.. దీనిపై అధికారులు పూర్తిస్థాయిలో స్పష్టత ఇవ్వకపోవడంతో దరఖాస్తుదారులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే కౌలు రైతులు దరఖాస్తుల్లో పొలం సర్వే నెంబర్ ఎవరిది వేయాలనే దానిపై తేల్చుకోలేక సతమతమవుతున్నారు. ఒకవేళ భూస్వామిని అడిగితే.. అతడు సర్వే నెంబర్ చెప్పకపోగా.. మళ్లీ కౌలుకు ఇచ్చేది లేదని ముఖంపైనే చెప్పేస్తున్నారని పలువురు కౌలు రైతులు వాపోతున్నారు. అద్దె ఇంట్లో ఉంటే ఆ ఇంటి యజమాని తమ ఇంటి నెంబర్ దరఖాస్తుల్లో వేయొద్దని ముందుగానే చెబుతుండడంతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆన్లైన్ చేయని దరఖాస్తులు
ఆరు గ్యారెంటీలకు దరఖాస్తులు తీసుకున్న మరుక్షణమే సంబంధిత అధికారులు ఆన్లైన్ చేయాలని ఇటీవల జరిగిన సమావేశంలో పై అధికారులు చెప్పినా ఆ తంతు ఎక్కడా కనిపించడం లేదు. గ్రామసభలు నిర్వహించే అధికారులను అడిగితే.. ఇంకా ఆన్లైన్పై స్పష్టత రాలేదని చెబుతున్నారు. ప్రజల నుంచి తీసుకున్న దరఖాస్తులన్నీ ఆన్లైన్ చేస్తారా.. లేదా.. కార్యాలయాల్లోనే కట్టలుగా పెడతారా.. అనే సందేహాలు దరఖాస్తుదారులకు కలుగుతున్నాయి.
గ్రామసభలను సందర్శించిన జెడ్పీ చైర్మన్ కంచర్ల
సుజాతనగర్ మండలం సీతంపేట, లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ కాలనీల్లో ప్రజా పాలన గ్రామసభలను జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు శుక్రవారం సందర్శించారు. ఆయన అధికారులతో మాట్లాడుతూ దరఖాస్తు విషయంలో ప్రజలకు ఎలాంటి సందేహాలు వచ్చినా వాటిని నివృత్తి చేయాలన్నారు. ప్రతి సమస్య పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. కొన్ని కుటుంబాలు ఒకే ఇంట్లో ఉన్నా.. వేర్వేరుగా ఉంటున్నారని, వారికి వేర్వేరుగా దరఖాస్తులు ఇవ్వాలన్నారు.
ఒకే ఇంట్లో మూడు కుటుంబాలు
మూడు కుటుంబాలు ఒకే ఇంట్లో ఉంటున్నాం. అదే ఇంటి నెంబర్ వేస్తే సొంత ఇంటిలా చూస్తారు కదా.. ఎలా. మేం ఏ ఇంటి నెంబర్ వేయాలి? అసలు ఇంటి నెంబర్ వెయ్యక పోతే మాకు గృహలక్ష్మి వస్తుందా.. లేదా.. అనేది అర్థం కావడం లేదు. మగవాళ్ల పేరుతో కనెక్షన్ ఉంటే గ్యాస్ సబ్సిడీ వస్తుందా.. అనే దానిపై ఎవరూ స్పష్టత ఇవ్వడం లేదు.
-రామగిరి రమణి, బాబూక్యాంపు, చుంచుపల్లి మండలం