మామిళ్లగూడెం, డిసెంబర్8 : పోలీస్శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా గురువారం దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శారీరక దారుఢ్య పరీక్షలకు 600 మంది పురుష అభ్యర్థులకు గాను 494 మంది హాజరయ్యారు. ఇందులో 199 మంది అభ్యర్థులు తుది పరీక్షకు అర్హత సాధించారు. ఉదయం పరేడ్ గ్రౌండ్స్కు చేరుకున్న అభ్యర్థులకు ముందుగా సీరియల్ నంబర్ ప్రకారం టోకెన్ అందజేశారు. అనంతరం 50 మంది అభ్యర్థులను ఒకొక బ్యాచ్గా చేసి ధ్రువీకరణ పత్రాలను పరిశీలన కోసం కౌంటర్ వద్ద తరలించారు.
అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత బయోమెట్రిక్ తీసుకున్నారు. అనంతరం రిస్ట్బాండ్ టాగింగ్, ఆర్ఎఫ్ఐడీ చిప్ జాకెట్ ధరింపజేశారు. అనంతరం1,600 మీటర్ల పరుగు పందెం నిర్వహించారు. 1,600 మీటర్ల పరుగు పోటీలో నిర్ణీత సమయంలో లక్ష్యం చేరి అర్హత సాధించిన వారికే ఎత్తు కొలతలకు అనుమతించారు. వరుస క్రమంలో నిర్వహించిన ఈవెంట్లలో అర్హత సాధించలేని అభ్యర్థులను నాట్ క్వాలిఫైయింగ్ రిజల్ట్స్ షీట్ అందజేసి ఎగ్జిట్ గేటు నుంచి బయటకు పంపించారు. శారీరక సామర్థ్య పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు, పొరపాట్లు జరగకుండా పోలీస్శాఖ ప్రత్యేక దృష్టిసారించిందని, పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో 32 సీసీ కెమెరాల నిఘాలో ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ తెలిపారు.
అభ్యర్థి పరుగు ప్రారంభించిన సమయంతోపాటు లక్ష్యం చేరుకున్న సమయాన్ని స్పష్టంగా రికార్డు చేసేందుకు ప్రతి అభ్యర్థికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైస్ (ఆర్ఎఫ్ఐడీ) చిప్తో కూడిన జాకెట్, చేతికి రిస్ట్ బాండ్లను బిగించారు. అభ్యర్థుల కోసం పరేడ్ గ్రౌండ్స్లో మొబైల్ టాయిలెట్స్, మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జనవరి 3వ తేదీ వరకు జరుగనున్న ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలకు 24,733 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇందులో 4,700 మంది మహిళలు కాగా, 20,033 మంది పురుషులు. వీరందరికీ షెడ్యూల్ ప్రకారం ఆయా రోజుల్లో, నిర్ధిష్ట సమయాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు సీపీ తెలిపారు.