మామిళ్లగూడెం, ఫిబ్రవరి 2: యాసంగి సీజన్ ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ సూచించారు. యాసంగి ధాన్యం సేకరణ, యూరియా పంపిణీ, మున్సిపల్ ఎన్నికలు, జిల్లా అధికారుల హాజరు తదితర అంశాలపై అదనపు కలెక్టర్లు డాక్టర్ శ్రీజ, శ్రీనివాసరెడ్డిలతో కలిసి ఆయా శాఖల అధికారులతో కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. యాసంగి సీజన్ దిగుబడి అంచనాలకు తగ్గట్టుగా కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, కొనుగోలుకు ముందే మిల్లర్లకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
యూరియా పంపిణీ వంద శాతం యాప్ ద్వారా జరుగుతున్నందున యూరియా కొరత ఉంటే ముందస్తుగానే తెలపాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల అధికారులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కౌంటింగ్ స్టాఫ్ శిక్షణకు కూడా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనంతరం, కేంద్ర ప్రభుత్వం నుంచి సరఫరా అయిన హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే పరికరాన్ని కలెక్టర్ ప్రారంభించి ఆరోగ్యశాఖకు అప్పించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు పద్మశ్రీ, రామారావు, శ్రీలత, పుల్లయ్య, డాక్టర్ చందూనాయక్, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ సుబారావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణి వినతులకు ప్రాధాన్యమివ్వాలి: కలెక్టర్
ప్రజావాణి వినతుల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. వాటిని పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత శాఖల అధికారులకు రిఫర్ చేశారు. అనంతరం. వివిధ శాఖల్లో పనిచేస్తూ జనవరి 31న పదవీ విరమణ పొందిన ఏడుగురు అధికారులు, సిబ్బందిని కలెక్టర్ సన్మానించి వారి సేవలను కొనియాడారు. అదనపు కలెక్టర్లు డాక్టర్ శ్రీజ, శ్రీనివాసరెడ్డి, డీఆర్వో పద్మశ్రీ, కలెక్టరేట్ ఏవో శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.