ఖమ్మం, జనవరి 18: సిద్ధార్థ యోగా విద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 21న నేలకొండపల్లిలో భారత జాతీయ ప్రకృతి ఆరోగ్య సమ్మేళనం నిర్వహించనున్నట్లు యోగా విద్యాలయం నిర్వాహకుడు డాక్టర్ కేవై రామచందర్రావు తెలిపారు. యోగా విద్యాలయం స్థాపించి 24 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఖమ్మంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ జాతీయ సమ్మేళనానికి 6 రాష్ర్టాల నుంచేగాక అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా దేశాల నుంచి కూడా ప్రతినిధులు హాజరుకానున్నట్లు వివరించారు. అదేవిధంగా 100 రకాల దేశవాళీ బియ్యం, కూరగాయల విత్తనాలు, మగ్గం నేత, మట్టి కుండలు, భారత పురాతన మల్కం గేమ్ వంటి ప్రదర్శనలు ఏర్పాటుచేయనున్నట్లు వివరించారు. అనంతరం బాలబాలికలతో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామన్నారు. ప్రకృతి ప్రేమికులు, ఆరోగ్య అభిలాషులు పాల్గొనాలని కోరారు. అప్పారావు, రవి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.