వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్
మణుగూరు రూరల్, జూలై 6: పినపాక నియోజకవర్గానికి కేంద్రంగా ఉన్న మణుగూరులోని 100 పడకల ఆస్పత్రిలో అన్ని వైద్య సదుపాయాలు కల్పిస్తామని వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ తెలిపారు. ఈ ఆస్పత్రిని ఆయన బుధవారం సందర్శించారు. ఆస్పత్రి మొత్తం కలియదిరిగారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను డీసీహెచ్ఎస్ డాక్టర్ ముక్కంటేశ్వరరావు, సూపరింటెండెంట్ డాక్టర్ పంచగిరి గిరి ప్రసాద్ నుంచి తెలుసుకున్నారు.
ఈ ఆస్పత్రి గతంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో ఉంది. 2021 సెప్టెంబర్ 3న వైద్య విధాన పరిషత్ విభాగానికి మారింది. ఈ ఆస్పత్రికి నేషనల్ హెల్త్ మిషన్, బ్లడ్ బ్యాంక్, డయాలసిస్ కేంద్రం, అన్ని రకాల మెటీరియల్, ఆపరేషన్ థియేటర్ త్వరలోనే అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు. ఆస్పత్రి నిర్వహణ, అందిస్తున్న వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అత్యవసర కేసులకు కూడా మెరుగైన వైద్యం అందిస్తున్న వైద్యులను అభినందించారు. ఆయనను సూపరింటెండెంట్, వైద్యులు, సిబ్బంది సన్మానించి జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో వైద్యులు జయప్రకాశ్, అరుణ్, తిలక్ పాల్గొన్నారు.