ఖమ్మం సిటీ, జనవరి 5: ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో గురువారం ఆలిండియా టీ-20 ఇన్విటేషన్ టోర్నమెంట్ షురూ అయ్యింది. పోటీలను ప్రముఖ వ్యాపారవేత్త కూరపాటి వెంకటేశ్వర్లు, జిల్లా యువజన, క్రీడల అధికారి పరంధామరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు దేశాలు, పది రాష్ర్టాల క్రికెటర్లు ఖమ్మానికి చేరుకోవడం అభినందనీయమన్నారు. కేపీఎల్ టోర్నమెంట్ చైర్మన్ డాక్టర్ కూరపాటి ప్రదీప్ మాట్లాడుతూ గతంలో మహిళా క్రికెట్ పోటీలను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించి ఖమ్మం ప్రతిష్టను ఇనుమడింపజేశామన్నారు. అనంతరం క్రీడాకారులను ఆయన పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుత్తా సీతయ్య, వడ్డె విజయ్, నల్లమల రంజిత్, టోర్నమెంట్ సపోర్టర్స్ భవార్ గుర్జార్, మహ్మద్ అజీమ్, నసీమ్, మోసీన్, డైరెక్టర్లు సందీప్ ఆర్య, నరేష్, కోచ్ మతీన్, అథ్లెటిక్స్ కోచ్ గౌస్, టీటీ కోచ్ సాంబమూర్తి, సీనియర్ క్రీడాకారులు వీరేష్గౌడ్, వెంకట్, సలీం తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ జట్టు విజయం
ఆలిండియా టీ-20 క్రికెట్ పోటీల్లో భాగంగా ఉదయం జరిగిన మ్యాచ్లో నేపాల్, తెలంగాణ జట్లు తలపడ్డాయి. అన్ని విభాగాల్లో రాణించిన తెలంగాణ టీం విజయం సాధించింది. మధ్యాహ్నం ఢిల్లీ, శ్రీలంక జట్లు బరిలోకి దిగాయి. శ్రీలంక క్రికెటర్ ఘర్షణ దేశ్రియ 15 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టడంతో జట్టు విజయపథంలో దూసుకెళ్లింది.