దమ్మపేట, జూన్ 1 : రైతులకు వానకాలం సాగు కోసం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఉచితంగా ఇవ్వాలని, పాత రుణాలు రద్దు చేసి.. కొత్తగా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కోరుతూ అఖిలభారత ఐక్య రైతు సంఘం(ఏఐయూకేఎస్) ఆధ్వర్యంలో దమ్మపేటలో సోమవారం మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపుడి రాము మాట్లాడుతూ రైతులు వ్యవసాయం చేయడానికి అవసరమైన పనిముట్లు సగం సబ్సిడీపై ప్రభుత్వమే అందించాలని, కల్తీ విత్తనాలు, పురుగు మందులను అరికట్టాలని, నకిలీ విత్తన వ్యాపారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అకాల వర్షాలతో నష్టపోయిన అరటి, మామిడి తదితర రైతులకు పరిహారం అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పడూరి వీరబాబు, కుంజ కాంతారావు, తామ రాముడు, కుంజ పాపారావు, తెల్లం నాగేశ్, వాడే గిరి, చాప ముత్యాలరావు, ఊకే మహేశ్, కేసరి వెంకటేశ్, ప్రసాద్, శీలం రాజు, కుంజ రవి, దారబోయిన మంగ తదితరులు పాల్గొన్నారు.